అంతిమ్‌ అదరహో

22 Sep, 2023 02:03 IST|Sakshi

ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సొంతం

పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత 

బెల్‌గ్రేడ్‌: భారత మహిళా టీనేజ్‌ రెజ్లర్‌ అంతిమ్‌ పంఘాల్‌ అద్భుతం చేసింది. హరియాణాకు చెందిన 19 ఏళ్ల అంతిమ్‌ ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మహిళల 53 కేజీల విభాగం కాంస్య పతక బౌట్‌లో అండర్‌–20 ‘డబుల్‌ ప్రపంచ చాంపియన్‌’ అంతిమ్‌ 16–6 పాయింట్ల తేడాతో ప్రపంచ మూడో ర్యాంకర్, యూరోపియన్‌ చాంపియన్‌ ఎమ్మా జోనా డెనిస్‌ మాల్‌్మగ్రెన్‌ (స్వీడన్‌)పై విజయం సాధించింది.

ఈ గెలుపుతో అంతిమ్‌ వచ్చే ఏడాది జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది. భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో భారత రెజ్లర్లు యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ పతాకంపై పోటీపడుతున్నారు. అంతిమ్‌ 2022, 2023 ప్రపంచ అండర్‌–20 చాంపియన్‌íÙప్‌లో 53 కేజీల విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడంతోపాటు 2023 ఆసియా సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచింది.  

ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన ఎనిమిదో భారతీయ రెజ్లర్‌గా అంతిమ్‌ పంఘాల్‌ గుర్తింపు పొందింది. గతంలో అల్కా తోమర్‌ (2006; కాంస్యం), బబిత ఫొగాట్‌ (2012; కాంస్యం), గీతా ఫొగాట్‌ (2012; కాంస్యం), వినేశ్‌ ఫొగాట్‌ (2019, 2022; కాంస్యాలు), పూజా ధాండ (2018; కాంస్యం), అన్షు మలిక్‌ (2021; రజతం), సరితా మోర్‌ (2021; కాంస్యం) ఈ ఘనత సాధించారు.    

మరిన్ని వార్తలు