క్రికెట్‌ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం

14 Sep, 2023 19:22 IST|Sakshi

ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు (సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 1 నుంచి ప్రతి ఆస్ట్రేలియా ఆటగాడు (దేశవాలీ, అంతర్జాతీయ ఆటగాళ్లు) నెక్‌ ప్రొటెక్టర్‌ హెల్మెట్‌తో బ్యాటింగ్‌కు దిగడం తప్పనిసరి చేసింది. ఇటీవలికాలంలో బ్యాటర్లు తరుచూ ఫాస్ట్‌ బౌలింగ్‌లో గాయపడుతుండటంతో సీఏ ఈ నిర్ణయం తీసుకుంది. సీఏ తీసుకున్న ఈ నిర్ణయంతో చాలామంది ఆసీస్‌ క్రికెటర్లు తమ మునుపటి ప్రాక్టీస్‌ను మార్చుకోవాల్సి వస్తుంది.

డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, ఉస్మాన్‌ ఖ్వాజా, టిమ్‌ డేవిడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌ తదితరులు నెక్‌ ప్రొటెక్టర్‌ హెల్మెట్‌ ధరించేందుకు ఇష్టపడరు. సీఏ తాజా నిర్ణయంతో వీరంతా తప్పనిసరిగా మెడ భాగం సురక్షితంగా ఉండేలా హెల్మెట్లు ధరించాల్సి ఉంటుంది. కాగా, నెక్‌ ప్రొటెక్టర్‌ హెల్మెట్లను క్రికెట్‌ ఆస్ట్రేలియా ఫిలిప్‌ హ్యూస్‌ మరణాంతరం (2012) ప్రత్యేకంగా తయారు చేయించింది.

హ్యూస్‌ ఈ నెక్‌ ప్రొటెక్టర్‌ హెల్మెట్‌ ధరించి ఉంటే ప్రాణాలు కోల్పోయే వాడు కాదు. 2019 యాషెస్‌ సిరీస్‌లో ఇంచుమించు ఇలాంటి ప్రమాదమే మరొకటి సంభవించి ఉండేది. నాడు ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ సంధించిన ఓ రాకాసి బౌన్సర్‌ స్టీవ్‌ స్మిత్‌ను మెడ భాగంలో బలంగా తాకింది. అంత జరిగాక కూడా స్మిత్‌ నెక్‌ ప్రొటెక్టర్‌ హెల్మెట్‌ ధరించేందుకు ఇష్టపడే వాడు కాదు. ఇది ధరిస్తే అతని హార్ట్‌ బీట్‌ అమాంతంగా పెరుగుతుందని అతను చెప్పుకొచ్చేవాడు.

వార్నర్‌ సైతం నెక్‌ ప్రొటెక్టర్‌ ధరిస్తే, అది తన మెడలోకి చొచ్చుకుపోయేదని చెప్పి తప్పించుకునే వాడు. సీఏ తాజా నిర్ణయంతో వీరు కారణాలు చెప్పి తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగుతున్న సిరీస్‌ సందర్భంగా రబాడ వేసిన ఓ రాకాసి బౌన్సర్‌ కెమారూన్‌ గ్రీన్‌ మెడ భాగంలో బలంగా తాకింది. అయితే అతను ఈ నెక్‌ ప్రొటెక్టర్‌ ఉండటంతో బ్రతికి బయటపడ్డాడు.

ఇది జరిగిన కొద్ది రోజులకే క్రికెట్‌ ఆస్ట్రేలియా నెక్‌ ప్రొటెక్టర్‌ హెల్మెట్‌ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. మరోవైపు స్వదేశంలోనూ బౌన్సీ పిచ్‌లు ఎక్కువగా ఉండటంతో దేశవాలీ క్రికెటర్లు కూడా ముందు జాగ్రత్తగా ఈ నెక్‌ ప్రొటెక్టర్‌ హెల్మెట్‌ ధరించి బ్యాటింగ్‌కు దిగాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటన జారీ చేసిం‍ది.

ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా జాతీయ జట్టు ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఆసీస్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన ఆసీస్‌.. 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది.

ఈ సిరీస్‌ అనంతరం ఆసీస్‌ సెప్టెంబర్‌ 22 నుంచి 27 వరకు టీమిండియాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడుతుంది. తదనంతరం అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొంటుంది.

మరిన్ని వార్తలు