CWC 2023: శ్రేయస్‌-రాహుల్‌.. జోడీ నంబర్‌ వన్‌

13 Nov, 2023 09:28 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (94 బంతుల్లో 128 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో విజృంభించి నెదర్లాండ్స్‌ను 160 పరుగుల భారీ తేడాతో ఓడించారు. భారత గెలుపులో రాహుల్‌, శ్రేయస్‌ ప్రధానపాత్ర పోషించారు.

ఈ జోడీ నాలుగో వికెట్‌కు అభేద్యమైన 208 పరుగుల భాగస్వామ్యం​ నమోదు చేసి టీమిండియా భారీ స్కోర్‌ చేయడానికి దోహదపడింది. ఈ క్రమంలో రాహుల్‌-శ్రేయస్‌ జోడీ వరల్డ్‌కప్‌ రికార్డు నెలక్పొంది. వరల్డ్‌కప్‌లో భారత్‌ తరఫున నాలుగు అంతకంటే తక్కువ వికెట్లకు నమోదైన భాగస్వామ్యాల్లో ఇదే అత్యుత్తమంగా నిలిచింది. దీనికి ముం​దు 2015 వరల్డ్‌కప్‌లో ధోని, రైనా జోడీ జింబాబ్వేపై నెలకొల్పిన అజేయ 196 పరుగుల భాగస్వామ్యం అత్యుత్తమంగా ఉండింది. 

ఇదే వరల్డ్‌కప్‌లో ఆసీస్‌పై విరాట్‌-రాహుల్‌ జోడీ నెలకొల్పిన 165 పరుగుల భాగస్వామ్యం ఈ విభాగంలో మూడో అత్యుత్తమంగా ఉంది. ఆతర్వాత 1996 వరల్డ్‌కప్‌లో కాంబ్లీ-సిద్దూ నెలకొల్పిన 142 పరుగుల భాగస్వామ్యం.. 1999 వరల్డ్‌కప్‌లో అజయ్‌ జడేజా, రాబిన్‌ సింగ్‌ నెలకొల్పిన 141 పరుగుల భాగస్వామ్యం వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.  మొత్తంగా నెదర్లాండ్స్‌పై కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి దోహదపడిన రాహుల్‌-శ్రేయస్‌ జోడీ నంబర్‌ వన్‌ జోడీ అనిపించుకుంది.

మరిన్ని వార్తలు