CWC 2023 Semi Finals: ధైర్యవంతులకే అదృష్టం కూడా అండగా నిలుస్తుంది: రోహిత్‌ శర్మ

15 Nov, 2023 08:13 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో ఇవాళ (నవంబర్‌ 15) అత్యంత కీలక సమరం జరుగనుంది. ముంబై వేదికగా జరుగనున్న తొలి సెమీఫైనల్లో భారత్‌,న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ఇరు జట్లు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇక బరిలోకి దిగడమే తరువాయి. మ్యాచ్‌ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. మరి ఏ జట్టు గెలుస్తుందో, ఏ జట్టు ఓడి ఇంటిబాట పడుతుందో తేలాలంటే మరి కొద్ది గంటలు వేచి చూడాలి.

మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మ్యాచ్‌కు సంబంధించిన పలు విషయాలు మాట్లాడారు. భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ..

ధైర్యవంతులకే అదృష్టం కూడా అండగా నిలుస్తుంది. మేం ఇప్పుడు పూర్తి నమ్మకంతో, ధైర్యంతో బరిలోకి దిగుతున్నాం. ఇలాంటప్పుడే కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. టోర్నీలో తొలి ఐదు మ్యాచ్‌లలో మేం లక్ష్యాన్ని ఛేదించగా, తర్వాతి నాలుగు మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్‌ చేశాం. కాబట్టి అన్ని రకాలుగా మమ్మల్ని మేం పరీక్షించుకున్నట్లే. వాటితో పోలిస్తే ఈ మ్యాచ్‌ ప్రాధాన్యత ఏమిటో మాకు తెలుసు. అయినా సరే మేం ఏమీ కొత్తగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎలా ఆడామో అలా ఆడితే చాలు. ఒత్తిడి కొత్త కాదు. 

ప్రపంచకప్‌లో సెమీస్‌ అయినా లీగ్‌ మ్యాచ్‌ అయినా ఒత్తిడి ఎలాగూ ఉంటుంది. భారత క్రికెటర్లపై ఇది మరీ ఎక్కువ. ఆటగాళ్లంతా ఆ స్థితిని దాటుకునే వచ్చారు కాబట్టి బాగా ఆడటమే అన్నింటికంటే ముఖ్యం. న్యూజిలాండ్‌ ఎంతో తెలివైన, క్రమశిక్షణ కలిగిన జట్టు. ప్రత్యర్ధిని బాగా అర్థం చేసుకొని తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటారు. 1983లో భారత్‌ వరల్డ్‌ కప్‌ గెలిచినప్పుడు ప్రస్తుత జట్టులో ఎవ్వరూ పుట్టనే లేదు.

2011లో సగం మంది క్రికెట్‌ మొదలు పెట్టలేదు. కాబట్టి ఈ జట్టు సభ్యులంతా గతం గురించి కాకుండా వర్తమానంపై, తమ ఆటపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. గతంలో నాకౌట్‌ మ్యాచ్‌లలో, నాలుగేళ్ల క్రితం ఏం జరిగిందనేది కూడా మాకు అనవసరమని అన్నాడు. 

చదవండి: భారత్‌తో మ్యాచ్‌ మాకు పెద్ద సవాల్‌.. మేం వాటికి అలవాటుపడిపోయాం: విలియమ్సన్‌

మరిన్ని వార్తలు