జై షా శ్రీలంక క్రికెట్‌ను సర్వనాశనం చేశాడు.. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాపై పెత్తనం చలాయిస్తున్నాడు..!

14 Nov, 2023 11:41 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో ఘోర వైఫల్యాలను ఎదుర్కొని, లీగ్‌ దశలోనే ఇంటిబాట పటి​న శ్రీలంక ఇంటాబయటా ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది. వరల్డ్‌కప్‌ నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించిన అనంతరం ఆ దేశ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే బోర్డు మొత్తాన్ని రద్దు చేశాడు. ఆపై బోర్డు అంతర్గత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ శ్రీలంక క్రికెట్‌ బోర్డుపై సస్పెన్షన్‌ వేటు వేసింది. 

తమ క్రికెట్‌ బోర్డుకు పట్టిన దుస్థితి నేపథ్యంలో ఆ దేశ వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తమ దేశ క్రికెట్‌కు ఈ గతి పట్టడానికి బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా కారణమని సంచలన ఆరోపణలు చేశాడు. తమ బోర్డు అధికారులతో ఉన్న సత్సంబంధాల కారణంగా షా మాపై పెత్తనం చెలాయిస్తున్నాడని ఆరోపించాడు.

తన తండి (అమిత్‌ షా) అధికారాన్ని అడ్డుపెట్టుకుని జై షా లంక క్రికెట్‌ను శాశిస్తున్నాడని ధ్వజమెత్తాడు. జై షా అనవసర జోక్యం కారణంగానే లంక క్రికెట్‌కు ఈ దుస్థితి దాపురించిందని వాపోయాడు. జై షాను ఉద్దేశిస్తూ రణతుంగ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్‌ సర్కిల్స్‌లో దుమారం రేపుతున్నాయి. 

కాగా, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో శ్రీలంక ఘోర ప్రదర్శన కనబర్చి లీగ్‌ దశలోనే ఇంటిబాట పట్టింది. ఆ జట్టు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం​ 2 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ కారణంగా శ్రీలంక 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీకి కూడా అర్హత సాధించలేకపోయింది. ఈ టోర్నీలో లంక క్రికెట్‌ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌పై విజయం సాధించడం. మరోవైపు భారత్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి.  బుధవారం జరుగబోయే తొలి సెమీఫైనల్లో భారత్‌.. న్యూజిలాండ్‌తో తలపడనుంది.

మరిన్ని వార్తలు