CWC 2023: పదేళ్ల నుంచి ఇంతే.. ఆశలు రేకెత్తిస్తారు, ఆఖర్లో ఉసూరుమనిపిస్తారు..!

20 Nov, 2023 16:48 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలిచి ఫైనల్‌కు చేరిన భారత్‌.. ఆఖరి మెట్టుపై (ఫైనల్స్‌) బోల్తా పడి 140 కోట్ల మంది భారతీయులకు గుండెకోత మిగిల్చింది. సెమీస్‌ లేదా ఫైనల్స్‌లో ఇలా చేతులెత్తేయడం భారత్‌కు ఇది కొత్తేమీ కాదు. గత పదేళ్ల కాలంలో టీమిండియా తొమ్మిది ఐసీసీ టోర్నీల్లో సెమీస్‌ లేదా ఫైనల్స్‌లో ఓటమిపాలైంది. 

ఐసీసీ టోర్నీల్లో భారత్‌ వరుస వైఫల్యాల తీరును పరిశీలిస్తే.. ఆయా టోర్నీల ఆరంభాల్లో చిచ్చరపిడుగుల్లా చెలరేగిపోయే భారత క్రికెటర్లు నాకౌట్‌ మ్యాచ్‌ అనగానే ఒత్తిడికి లోనై చతికిలపడతారు. 2013 నుంచి ఐసీసీ టోర్నీల్లో ఇదే తంతు కొనసాగుతుంది. వరల్డ్‌కప్‌ 2023లోనూ సెమీస్‌ వరకు ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత ఆటగాళ్లు ఫైనల్‌ మ్యాచ్‌లో చేతులెత్తేశారు. 

ఎన్నో అంచనాల నడుమ ఫైనల్‌ మ్యాచ్‌ బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో స్థాయికి తగ్గట్టుగా ఆడలేక ఓడారు. ఆశలు రేకెత్తించి, ఆఖర్లో ఊసూరుమనిపించడం టీమిండియా ఆటగాళ్లకు పరిపాటిగా మారింది. ఓటముల నుంచి గుణపాఠం నేర్చుకోని టీమిండియా నెక్స్ట్‌ టైమ్‌ బెటర్‌ లక్‌ అంటూ సర్ధి చెప్పుకోవడం తప్పించి చేసిందేమీ లేదు. 

అభిమానులు సైతం​ ఇదే అనుకుంటూ ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తుండటంతో వారిలో సీరియస్‌నెస్‌ కొరవడింది. విచ్చలవిడిగా డబ్బు, పబ్లిసిటీ లభిస్తుండటంతో వాటిపైనే ఎక్కువగా ఫోకస్‌ పెట్టే భారత క్రికెటర్లు ఇకనైనా అలసత్వం వీడాలి. లేకపోతే నెక్స్ట్‌ జనరేషన్‌ కూడా గెలుపును అంత సీరియస్‌గా తీసుకోదు. ఒత్తిడిలో ఎలా ఆడాలో ఆసీస్‌ ఆటగాళ్ల నుంచి మనవాళ్లు ఎంతైనా నేర్చుకోవాలి. ప్రతిభ గల జట్టును బెంచ్‌ మార్క్‌గా పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. అభిమానులకు ఇది కాస్త ఇబ్బందికరంగానే ఉండవచ్చు కానీ అనక తప్పదు.

2013 నుంచి ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ప్రస్తానం..

  • 2014 టీ20 వరల్డ్‌కప్‌: ఫైనల్లో ఓటమి
  • 2015 వన్డే వరల్డ్‌కప్‌: సెమీస్‌లో ఓటమి
  • 2016 టీ20 వరల్డ్‌కప్‌: సెమీస్‌లో ఓటమి
  • 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ: ఫైనల్స్‌లో ఓటమి
  • 2019 వన్డే వరల్డ్‌కప్‌: సెమీస్‌లో ఓటమి
  • 2021 వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌: ఫైనల్లో ఓటమి
  • 2022 టీ20 వరల్డ్‌కప్‌: సెమీఫైనల్లో ఓటమి
  • 2023 వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌: ఫైనల్లో ఓటమి
  • 2023 వన్డే వరల్డ్‌కప్‌: ఫైనల్లో ఓటమి
మరిన్ని వార్తలు