#MSDhoni: 'నా చివరి ఐపీఎల్‌ అని మీరే డిసైడ్‌ అయ్యారా?'

3 May, 2023 17:30 IST|Sakshi
Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌ సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి చివరిదని అందరు అనుకుంటున్నారు. అందుకే సీఎస్‌కే ఎక్కడ మ్యాచ్‌ ఆడినా కేవలం ధోనిని చూడడం కోసమే పోటెత్తుతున్నారు. సీఎస్‌కే గెలుపోటములతో సంబంధం లేకుండా కేవలం ధోని కోసమే ఐపీఎల్‌ చూస్తున్నామన్నట్లు అభిమానులు చెప్పకనే చెప్తున్నారు.

ఎక్కడ మ్యాచ్‌ ఆడినా ధోని బ్యాటింగ్‌ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అతను రెండు బంతులాడిన చాలు అదే మాకు మహాప్రసాదం అన్నట్లుగా  అభిమానులు తపించిపోతున్నారు. తాజాగా బుధవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌ ఆడేందుకు సీఎస్‌కే ఎకానా స్టేడియానికి వచ్చింది. ఎప్పటిలాగే స్టేడియంలోని స్టాండ్స్‌ అన్ని ధోనికి మద్దతుగా సీఎస్‌కే జెర్సీలతో నిండిపోయాయి. టాస్‌ పడడానికి ముందే స్టేడియానికి పోటెత్తిన అభిమానులు.. ధోని.. ధోని అంటూ అరుపులతో హోరెత్తించారు.

ఇక టాస్‌ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్‌ ధోని బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ''ఇది చివరి ఐపీఎల్‌ అని ఫేర్‌వెల్‌గా మీకు సపోర్ట్‌ చేయడానికి ఇంత మంది వచ్చారు..దీన్ని ఎలా స్వీకరిస్తారు'' అని కామెంటేటర్‌ ప్రశ్నించాడు. దీనికి ధోని.. ''ఇది నా చివరి ఐపీఎల్‌ అని  మీరే డిసైడ్‌ అయ్యారు.. నేను కాదు'' అని నవ్వుతూ పేర్కొన్నాడు.

దీంతో కామెంటేటర్‌.. ''అయితే వచ్చే ఏడాది ఐపీఎల్‌లో లక్నోలో మళ్లీ ధోనిని చూడబోతున్నాం.. సిద్ధంగా ఉండండి' అనగానే.. అభిమానులు ధోని.. ధోని అని గట్టిగా అరవడం ఆసక్తి కలిగించింది. దీన్నిబట్టి ధోని తాను ఈ ఐపీఎల్‌ తర్వాత రిటైర్‌ అవ్వాలని అనుకోవడం లేదని.. వచ్చే ఐపీఎల్‌ కూడా ఆడే అవకాశం ఉందని అభిమానులు తమకు తాము ఊహించుకుంటున్నారు. ఏదైనా ధోని రిటైర్మెంట్‌ వెనుక ఉన్న మిస్టరీకి కొంత సమాధానం దొరికినట్లే. ఇది క్లియర్‌ అవ్వాలంటే ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఎండింగ్‌ వరకు వేచి చూడాల్సిందే. 

చదవండి: 'నేను ఔటయ్యానా?'.. జడ్డూ దెబ్బకు షాక్‌లో స్టోయినిస్‌

మరిన్ని వార్తలు