David Rudisha: 'తృటిలో తప్పించుకున్నా.. ఆలస్యమయ్యుంటే ప్రాణాలు గాల్లో కలిసేవి'

13 Dec, 2022 15:30 IST|Sakshi

కెన్యాకు చెందిన అథ్లెట్‌ డేవిడ్ రుడిషా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కెన్యాలోని కిమానా వైల్డ్‌లైఫ్‌ సాంచురీలో జరిగిన మసాయి ఒలింపిక్స్‌ కాంపిటీషన్‌కు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో అతను ప్రయాణిస్తున్న విమానం క్రాష్‌కు గురైంది. ఈ సమయంలో రుడిషాతో పాటు మరో ఐదుగురు ఉన్నారు.

ల్యాండింగ్‌ చేసే సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తమైన పైలట్‌ విమానం టేకాఫ్‌ చేయడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో విమానంకు చెందిన రెక్క ఒకటి చెట్లకు తగిలి గుండ్రంగా తిరుగుతూ మట్టి పెళ్లపై పడిపోయింది. అప్పటికే డోరు తీసుకొని రుడిషా సహా మిగతా ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం రుడిషాతో పాటు మిగతావారు క్షేమంగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

ఇక ప్రమాదంపై రుడిషా స్పందించాడు. ''మరో ఏడు, ఎనిమిది నిమిషాల్లో విమానం టేకాఫ్‌ తీసుకుంటుందనగా ఇంజిన్‌లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్‌ ల్యాండింగ్‌కు ప్రయత్నించగా.. విమానం రెక్క ఒకటి చెట్లకు తగిలి కింద పడడం ప్రారంభమైంది. అప్పటికే మేము గాయాలతో బయట పడ్డాం.. కొద్దిగా ఆలస్యమైనా మా ప్రాణాలు పోయేవే.'' అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇక డేవిడ్‌ రుడిషా 800 మీటర్ల రేసులో రెండుసార్లు ఒలింపిక్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌, 2016 రియో ఒలింపిక్స్‌లో 800 మీటర్ల రేసులో వరుసగా రెండు స్వర్ణ పతకాలు అందుకున్నాడు. అంతేకాదు 2011, 2015 వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లోనూ 800 మీటర్ల రేసులో పతకాలు సాధించాడు.

మరిన్ని వార్తలు