IPL 2022: తుఫాను దాటికి ఈడెన్‌ గార్డెన్స్ కుదేలు‌.. ప్లే ఆఫ్స్‌ ‍మ్యాచ్‌లేమో అక్కడే!

22 May, 2022 13:14 IST|Sakshi

కోల్‌కతా నగరాన్ని తుఫాన్‌ ముంచెత్తింది. శనివారం రాత్రి ఈదురుగాలులు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ కుదేలైంది. 90 కిమీ వేగంతో వీసిన ఈదురుగాలుల దాటికి స్టేడియంలోకి ప్రెస్‌బాక్స్‌ అద్దాలు, పలు హోర్డింగ్స్‌, మైదానంలో కప్పి ఉంచిన టార్ఫులిన్‌ కవర్‌ ధ్వంసమయ్యాయి. పరిస్థితిని పర్యవేక్షించిన స్టేడియం అధికారులు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టారు.

కాగా కోల్‌కతా వేదికగానే ఐపీఎలో రెండు ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు జరగనున్న సంగతి తెలిసిందే. మంగళవారం(మే 24న) గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ తొలి క్వాలిఫయర్‌.. మే 25న(బుధవారం) ఆర్‌సీబీ, లక్నో సూపర్‌జెయింట్స్‌ మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరగనున్నాయి. కాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ.. బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(క్యాబ్‌) అధికారులతో కలిసి ఈడెన్‌ గార్డెన్‌ను పరిశీలించారు. ''మ్యాచ్‌లకు మరో రెండురోజులు సమయం ఉంది. అప్పటివరకు స్టేడియాన్ని రెడీ చేస్తాం. ప్రెస్‌ బాక్స్‌లో పగిలిన అద్దాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం వర్షం లేదు.. మాములుగానే ఉంది. మైదానంలోని టార్ఫులిన్‌ కవర్‌ను తొలగించి డ్రెయిన్‌ సిస్టం ఆన్‌చేశాం. పరిస్థితి పూర్తిగా కంట్రోల్‌లో ఉంది'' అని క్యాబ్‌ అధికారులు తెలిపారు. 

కాగా వర్షం కారణంగా గుజరాత్‌ టైటాన్స్‌ విమానం కాస్త ఆలస్యంగా కోల్‌కతాకు చేరుకుంది. వాస్తవానికి శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో కోల్‌కతాకు రావాల్సిన విమానం.. భారీ వర్షం కారణంగా ఆటగాళ్లు ప్రయాణించిన విమానం బంగ్లాదేశ్‌ ఎయిర్‌స్పేస్‌లో ల్యాండ్‌ అయింది. వర్షం ఆగిపోయాకా రెండు గంటల ఆలస్యంగా.. అంటే రాత్రి ఏడు గంటల ప్రాంతంలో కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు చచేరుకుంది.  ఆటగాళ్లను బస్‌లో సురక్షితంగా హోటల్‌ రూంకు తరలించారు. ఇక క్వాలిఫయర్‌ -2 సహా ప్రతిష్టాత్మక ఫైనల్‌ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.

చదవండి: Jasprit Bumrah: ఐపీఎల్‌లో తొలి భారత బౌలర్‌గా బుమ్రా అరుదైన ఫీట్‌

మరిన్ని వార్తలు