World Cup 2023: సెమీస్‌ రేసు నుంచి పాక్‌ అవుట్‌! ఒకవేళ పోటీలో ఉండాలంటే?

9 Nov, 2023 21:00 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో పాకిస్తాన్‌ సెమీస్‌ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. ఈ మెగా టోర్నీలో భాగంగా శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్‌.. పాక్‌ సెమీస్‌ ఆశలపై నీళ్లు జల్లింది. ఈ విజయంతో న్యూజిలాండ్‌ తమ సెమీఫైనల్‌  బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ సెమీఫైనల్‌కు చేరాలంటే అద్బుతాలే జరగాలి. 

ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో ఇప్పటికే భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. నాలుగో స్ధానం కోసం న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, అఫ్గానిస్తాన్‌ జట్లు పోటీపడుతున్నాయి. అయితే లంకపై విజయంతో పాయింట్ల పట్టికలో కివీస్‌ నాలుగో స్ధానానికి చేరుకుంది.

న్యూజిలాండ్‌ రన్‌రేట్‌ (+743), పాక్‌(+0.036), అఫ్గానిస్తాన్‌(-0.338) కంటే మెరుగ్గా ఉంది. ఒకవేళ పాక్‌, అఫ్గాన్‌ తమ చివరి మ్యాచ్‌ల్లో గెలిచి మూడు జట్ల పాయింట్లు సమమైనా.. రన్‌రేట్‌ పరంగా కివీస్‌కే సెమీస్‌ చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే పాకిస్తాన్‌కు టెక్నికల్‌గా సెమీస్‌ దారులు ఇంకా మూసుకుపోలేదు.

పాకిస్తాన్‌ సెమీస్‌ చేరాలంటే?
పాకిస్తాన్‌కు ఈ టోర్నీలో ఇంకా ఒకే మ్యాచ్‌ మిగిలి ఉంది. నవంబర్‌ 11న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 287 పరుగుల తేడాతో ఓడిస్తేనే పాకిస్తాన్‌ రన్‌రేట్‌ పరంగా కివీస్‌ను అధిగమిస్తుంది.

తద్వారా సెమీఫైనల్‌కు నాలుగో జట్టుగా అర్హత సాధిస్తుంది. మరోవైపు ప్రత్యర్ధి విధించిన టార్గెట్‌ను పాక్‌ కేవలం 2.2 ఓవర్లలోనే ఛేదించాలి. ఒకవేళ ఇంగ్లండ్‌ 50 పరుగులకు ఆలౌటైతే.. పాక్‌ టార్గెట్‌ను 2. 2 ఓవర్‌లోనే ఛేజ్‌ చేయాలి. ఇది జరగడం ఆసాధ్యం. కాబట్టి ఇంగ్లండ్‌ మొదటి బ్యాటింగ్‌ చేస్తే పాకిస్తాన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే.
చదవండి: World Cup 2023: చరిత్ర సృష్టించిన రచిన్‌ రవీంద్ర.. సచిన్‌ రికార్డు బద్దలు

మరిన్ని వార్తలు