కుటుంబ సభ్యులకు అనుమతి

31 Oct, 2020 06:23 IST|Sakshi

ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెటర్లకు ఊరట  

ముంబై: ఆస్ట్రేలియా పర్యటనలో క్రికెటర్ల వెంట వారి కుటుంబ సభ్యులను అనుమతిస్తున్నట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం తెలిపింది. రెండున్నర నెలల పాటు సాగనున్న ఈ పర్యటనలో కుటుం బ సభ్యుల్ని కూడా అనుమతించాలని సీనియర్‌ క్రికెటర్లు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. కఠిన క్వారంటైన్‌ నిబంధనల నేపథ్యంలో తొలుత బీసీసీఐ ఈ అంశాన్ని వ్యతిరేకించింది.

ఐపీఎల్‌ కోసం యూఏఈలో ఉన్న భారత క్రికెటర్లు ఫైనల్‌ ముగియగానే నేరుగా ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. ఇప్పటికే నెలకు పైగా కుటుంబాలకు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా లాంటి కొందరు సీనియర్‌ క్రికెటర్లు... ఆసీస్‌ పర్యటన ముగించుకొని తిరిగి భారత్‌ వచ్చేసరికి  దాదాపు ఆరు నెలల సమయం పట్టనుంది. దీంతో బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిపింది. నవంబర్‌ 27 నుంచి జనవరి 19 వరకు ఆస్ట్రేలియాతో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్‌ 3 టి20లు, 3 వన్డేలు, 4 టెస్టులు ఆడనుంది. 

మరిన్ని వార్తలు