Virat Kohli: కోహ్లి కెరీర్‌లో తొలిసారి.. జీవితకాలం గుర్తుండిపోవడం ఖాయం!

3 Oct, 2022 07:57 IST|Sakshi

టీమిండియా రన్‌మెషిన్‌ విరాట్‌ కోహ్లికి వింత అనుభం ఎదురైంది. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టి20లో కోహ్లి ఒక్క పరుగు తేడాతో హాఫ్‌ సెంచరీకి దూరమయ్యాడు. అదేంటి మ్యాచ్‌ అన్నాకా సెంచరీ, హాఫ్‌ సెంచరీలు మిస్‌ కావడం కామన్‌. కామన్‌గా మిస్‌ అయితే పర్వాలేదు.. కానీ తన తప్పిదం వల్ల ఒక బ్యాటర్‌ సెంచరీ.. హాఫ్‌ సెంచరీ మిస్‌ అయితే చాలా బాధగా ఉంటుంది. తాజాగా కోహ్లి షార్ట్‌రన్‌ తప్పిదంతో తన 34వ హాఫ్‌ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు. 

టీమిండియా ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. అప్పటికి కోహ్లి 13 బంతుల్లో 16 పరుగులు, సూర్య 14 బంతుల్లో 41 పరుగులతో దూకుడుగా ఆడుతున్నారు. వేన్‌ పార్నెల్‌ వేసిన ఓవర్‌ ఐదో బంతిని కోహ్లి స్క్వేర్‌లెగ్‌ దిశగా ఆడాడు. కోహ్లి-సూర్య జోడి రెండు పరుగులు పూర్తి చేశారు. అయితే అంపైర్‌ షార్ట్‌రన్‌ అంటూ సిగ్నల్‌ ఇచ్చాడు. దీంతో ఆశ్చర్యపోయిన కోహ్లి అదేంటి అని సందేహం వ్యక్తం చేశాడు.

తొలి పరుగు పూర్తి చేసే క్రమంలో నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో బ్యాట్‌ను క్రీజులో పెట్టలేదని రిప్లేలో స్పష్టంగా కనిపించింది. రూల్స్‌ ప్రకారం పరుగు తీసే క్రమంలో బ్యాట్‌ను క్రీజులో పెట్టకపోతే దానిని షార్ట్‌రన్‌గా పరిగణిస్తారు. దీంతో కోహ్లి ఖాతాలో నుంచి ఒక్క పరుగు మైనస్‌ అయింది. అయితే ఆ ఒక్క పరుగు అతన్ని హాఫ్‌ సెంచరీ చేయకుండా అడ్డుకుంటుందని బహుశా కోహ్లి కూడా ఊహించలేదనుకుంటా. ఇక చివరికి కోహ్లి 28 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 49 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఫిట్‌నెస్‌కు మారుపేరైన కోహ్లికి.. ఈ షార్ట్‌రన్‌ తప్పిదం జీవితకాలం గుర్తుండిపోయే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయపడ్డారు.

చదవండి: భారత్‌-సౌతాఫ్రికా మ్యాచ్‌.. కొత్త రూల్స్‌ మరిచితిరి!

మరిన్ని వార్తలు