పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కన్నుమూత

21 Mar, 2024 15:45 IST|Sakshi

పాకి​స్తాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సయీద్‌ అహ్మద్‌ (86) అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. డాషింగ్‌ బ్యాటర్‌గా పేరున్న అహ్మద్‌ పాక్‌ తరఫున 41 టెస్ట్‌లు ఆడి ఐదు సెంచరీలు, 16 హాఫ్‌ సెంచరీల సాయంతో 2991 పరుగులు చేశాడు. రైట్‌ ఆర్మ్ ఆఫ్‌ స్పిన్‌ బౌలర్‌ అయిన అహ్మద్‌ పాక్‌ తరఫున 22 వికెట్లు పడగొట్టాడు. 1958లో వెస్టిండీస్‌తో జరిగిన బ్రిడ్జ్‌టౌన్‌ టెస్ట్‌లో అరంగేట్రం చేసిన అహ్మద్‌.. తన స్వల్ప కెరీర్‌లో మూడు మ్యాచ్‌ల్లో పాక్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

అహ్మద్‌ క్రికెట్‌ కెరీర్‌కు 20 ఏళ్ల చిరు ప్రాయంలోనే పుల్‌ స్టాప్‌ పడింది. 1972-73 ఆస్ట్రేలియా టూర్‌లో అహ్మద్‌ తన చివరి టెస్ట్‌ మ్యాచ్‌ (మెల్‌బోర్న్‌) ఆడాడు. ఫిట్‌నెస్‌ విషయంలో క్రికెట్‌ బోర్డుకు తప్పుడు సమాచారం అందించాడన్న కారణంగా అతని కెరీర్‌కు అర్దంతంగా ఎండ్‌ కార్డ్‌ పడింది. పాక్‌ దిగ్గజం హనీఫ్‌ ముహమ్మద్‌ విండీస్‌పై చారిత్రక ట్రిపుల్‌ సెంచరీ (337) సాధించిన ఇన్నింగ్స్‌లో అహ్మద్‌ అతని భాగస్వామిగా ఉన్నాడు.

ఆ ఇన్నింగ్స్‌లో అహ్మద్‌ 65 పరుగులు చేశాడు. అహ్మద్‌ పాక్‌ జాతీయ జట్టుకు ఆరో కెప్టెన్‌గా వ్యవహరించాడు. అహ్మద్‌ సారధ్యం వహించిన మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి. సయీద్‌ అహ్మద్‌ మరణవార్తను ప్రస్తుత పీసీబీ చైర్మన్‌ మొహిసిన్‌ నఖ్వ్‌ క్రికెట్‌ ప్రపంచానికి తెలియజేశారు. సయీద్‌ అహ్మద్‌ సోదరుడు యూనుస్‌ అహ్మద్‌ కూడా పాక్‌ టెస్ట్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. యూనుస్‌ పాక్‌ తరఫున నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడాడు. 1987లో భారత్‌లో పర్యటించిన పాక్‌ జట్టులో యూనస్‌ సభ్యుడిగా ఉన్నాడు. ఆ పర్యటనలో పాక్‌కు ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యం వహించాడు. 

  

  

Election 2024

మరిన్ని వార్తలు