ప్రజ్ఞానంద మరో సంచలన విజయం.. ఈసారి ఎనిమిదో ర్యాంకర్‌పై..! 

18 Aug, 2022 07:08 IST|Sakshi

మయామి: ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌ అంతర్జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీలో భారత యువ గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానంద వరుసగా రెండో విజయం నమోదు చేశాడు. తొలి రౌండ్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్‌)ను ఓడించిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద... రెండో రౌండ్‌లో ఎనిమిదో ర్యాంకర్‌ అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌)పై గెలిచాడు. నేపాల్‌ సంతతికి చెందిన అనీశ్‌ గిరితో జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ప్రపంచ 89వ ర్యాంకర్‌ ప్రజ్ఞానంద 2.5–1.5తో నెగ్గాడు. తొలి మూడు గేమ్‌లు ‘డ్రా’ కాగా నాలుగో గేమ్‌లో ప్రజ్ఞానంద 81 ఎత్తుల్లో గెలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.

ఈ గెలుపుతో ప్రజ్ఞానందకు 7,500 డాలర్లు (రూ. 5 లక్షల 94 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్‌ రాబిన్‌ లీగ్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. రెండో రౌండ్‌ తర్వాత ప్రపంచ చాంపియన్‌ కార్ల్‌సన్‌ (నార్వే), ప్రజ్ఞానంద ఆరు పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో ఉన్నారు.  
 

మరిన్ని వార్తలు