Asia Cup 2022: 'శ్రీలంకతో కీలక పోరు.. చాహల్‌ను పక్కన పెట్టి అతడిని తీసుకోండి'

6 Sep, 2022 09:46 IST|Sakshi

ఆసియాకప్‌-2022 సూపర్‌-4లో భాగంగా శ్రీలంకతో కీలక పోరుకు సిద్దమైంది. దుబాయ్‌ వేదికగా మంగళవారం జరగనున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా తాడోపేడో తేల్చుకోనుంది. సూపర్‌-4లో భాగంగా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ చేతిలో భారత్‌కు ఎదురైన పరాజయం .. ఫైనల్‌ రేసును ఆసక్తికరంగా మార్చింది. భారత్‌ ఫైనల్‌కు చేరాలంటే తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా విజయం సాధించాలి.

ఇక శ్రీలంకతో డూ ఆర్‌డై మ్యాచ్‌కు భారత జట్టులో మార్పులు చేయాలని టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ సూచించాడు. దారుణంగా విఫలమవుతున్న యుజ్వేంద్ర చాహల్ స్థానంలో అవేశ్ ఖాన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని గంభీర్‌ సలహా ఇచ్చాడు. అదే విధంగా భారత లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని అతడు తెలిపాడు.

చాహల్‌ను పక్కన పెట్టి అవేష్‌ ఖాన్‌కు తిరిగి జట్టులోకి తీసుకురావాలి. అదే విధంగా రవి బిష్ణోయ్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం ఇవ్వాలి. అతడు పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఈ టోర్నీలో చాహల్‌ అంతగా రాణించలేకపోయాడు. కాబట్టి లెగ్‌ స్పిన్నర్‌ బిష్ణోయ్‌కు మరిన్ని అవకాశాలు కల్పించే సమయం అసన్నమైంది అని గంభీర్‌ పేర్కొన్నాడు.

కాగా పాకిస్తాన్‌ జరిగిన మ్యాచ్‌లో బిష్ణోయ్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో 26 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ పడగొట్టాడు. చాహల్‌ మాత్రం తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 43 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ సాధించాడు.

శ్రీలంకతో మ్యాచ్‌కు భారత తుది జట్టు (అంచనా)..
కేఎల్‌ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్‌ కార్తీక్‌ (వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్‌ సింగ్
చదవండి: Asia Cup 2022 IND VS SL Super 4: శ్రీలంకతో కీలక పోరుకు భారత్‌ 'సై'.. అశ్విన్‌కు చాన్స్‌ ఉందా?

మరిన్ని వార్తలు