IPL 2024: హార్దిక్‌ నిజంగా ముంబై ఇండియన్స్‌లోకి వెళ్తాడా? ఒకవేళ వెళ్లినా గానీ..

25 Nov, 2023 21:25 IST|Sakshi
Courtesy: ipl.com

ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌, గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా గురించి ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. హార్దిక్‌ పాండ్యాను ట్రేడింగ్‌ రూపంలో గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి తిరిగి ముం​బై ఇండియన్స్‌ సొంతం చేసుకోనుందన్నది ఆ వార్త సారాంశం. క్యాష్ ట్రేడింగ్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌కు రూ. 15 కోట్లు చెల్లించి హార్దిక్ పాండ్యాను ముంబై కొనుగోలు చేయనున్నట్లు వినికిడి.

ఇప్పటికే ఇరు ఫ్రాంచైజీల మధ్య క్యాష్‌ డీల్‌ కూడా పూర్తి అయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా తన అభిప్రాయాలను వెల్లడించాడు. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ ఇవ్వకపోతే హార్దిక్‌ ప్రాంఛైజీ మారడంలో అర్థం లేదని  ఆకాశ్‌ చోప్రా తెలిపాడు. 

"హార్దిక్‌ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు తిరిగి వెళుతున్నాడని ఓ వార్త తెగ చెక్కర్లు కొడుతోంది. అయితే ఇంకా ముంబై గానీ, గుజరాత్‌ ఫ్రాంచైజీ గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అతడు తమ ఫ్రాంచైజీని విడిచి వెళ్లాలంటే ముందుగా గుజరాత్‌ టైటాన్స్ ఒప్పుకోవాలి. ఎందుకంటే అతడు ఇప్పటికే గుజరాత్‌ను ఒక్కసారి విజేతగా, మరోసారి రన్నరప్‌గా నిలిచాడు.

ఒకవేళ ముంబై ఇండియన్స్‌కు వెళ్లినా, వారు తమ జట్టుకు కెప్టెన్‌గా చేస్తారా? కెప్టెన్సీ ఇవ్వకపోతే ఫ్రాంఛైజీ మారడం దండుగ. అయితే నాకు ఇంకా ఈ విషయం గురించి పెద్దగా తెలియదు. అందుకే త్వరలో ఏం జరగనుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. కానీ నిప్పు లేనిదే పొగ రాదు. హార్దిక్‌ నిజంగా ముంబైకు వెళ్లనున్నాడా? అసలు అది సాధ్యమేనా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఎదురు చూడాలి తన యూట్యూబ్‌ ఛానల్‌లో చోప్రా పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2024 సీజన్‌కు సంబంధించిన వేలం డిసెంబర్‌ 19న దుబాయ్‌ వేదికగా జరగనుంది.
చదవండి: IND vs AUS 2nd T20: ఆస్ట్రేలియాతో రెండో టీ20.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌!?

మరిన్ని వార్తలు