ఐపీఎల్‌లో మద్దతు లేదు: హోల్డర్‌

22 Oct, 2020 19:52 IST|Sakshi

అబుదాబి: నల్లజాతీయులపై జరుగుతున్న దాడులకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌(బీఎల్‌ఎమ్‌) ఉద్యమం జరుగుతుంటే ప్రస్తుత ఐపీఎల్‌లో దాని గురించి ఎటువంటి సపోర్ట్‌ లేకపోవడం తీవ్ర నిరాశను కల్గించిందని వెస్టిండీస్‌ క్రికెటర్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాడు జేసన్‌ హోల్డర్‌ పేర్కొన్నాడు. దీనికి క్రికెట్‌ వెస్టిండీస్‌ ఎంతో మద్దతుగా నిలుస్తుంటే కొన్ని చోట్ల దానికి ఊసే లేకపోవడం బాధకల్గిస్తుందన్నాడు.  విండీస్‌ జట్టు తరఫున ప్రతిష్టాత్మక పీటర్‌ స్మిత్‌ అవార్డు స్వీకరణ సందర్భంగా హోల్డర్‌ వర్చువల్‌ కార్యక్రమంలో మాట్లాడాడు. (గంభీర్‌.. ఇప్పుడేమంటావ్‌?)

ఇక్కడ(ఐపీఎల్‌లో) బీఎల్‌ఎమ్‌ మాటే వినిపించడం లేదు. అసలు దాన్ని గుర్తించకపోవడం చాలా నిరాశ కల్గిస్తుంది. ఇంగ్లండ్‌లో విండీస్‌ మహిళా జట్టు ఆడినప్పుడు కూడా బీఎల్‌ఎమ్‌ లోగోలతో ఉద్యమాన్ని మద్దతు ప్రకటించారు. ఇది సుదీర్ఘ కాలంగా నడుస్తున్న సమస్య.  ఇంకా చాలాదూరం పయనించాలి. అంతా ఒక్కటై సమానత్వం కోసం ఉద్యమిస్తేనే నల్లజాతీయులపై వివక్షను రూపు మాపవచ్చు. అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యానంతరం ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతోంది.  క్రికెట్‌ మైదానంలో దానికి సంఘీభావాన్ని తెలుపుతూ ఆ ఉద్యమాన్ని  ముందుకు  తీసుకెళుతున్నారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగమయ్యేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విండీస్‌ జట్టుకు ప్రత్యేక అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్‌లో దాని ప్రస్తావనే లేకపోవడంపై హోల్డర్‌ తన మాటల ద్వారా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు