‘క్రికెట్‌ జట్లను నడిపించడానికే పుట్టాడు’

3 Jan, 2021 17:53 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో కెప్టెన్‌గా వ్యవహరించిన అజింక్యా రహానేపై సర్వత్రా ప్రశంసలు వర్షం కురుస్తూనే ఉంది. విరాట్‌ కోహ్లి గైర్హాజరీతో జట్టును ఎలా ముందుకు తీసుకెళతాడో అన్న వాళ్లకి రహానే మ్యాచ్‌ గెలిపించి చూపించాడు.  కాగా, ఆ మ్యాచ్‌లో సెంచరీతో జట్టును గట్టెక్కించి విజయంలో కీలక పాత్ర పోషించిన రహానేను ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ కొనియాడాడు. క్రికెట్‌ కోసమే రహానే పుట్టాడని చాపెల్‌ అభినందించాడు. ఈసీపీఎన్‌ క్రికెట్‌ ఇన్ఫోకు రాసిన కాలమ్‌లో రహానేను చాపెల్‌ ప్రత్యేకంగా ప్రశంసించాడు. (రోహిత్‌ బీఫ్‌ ఆర్డర్‌ చేశాడా.. హిట్‌మ్యాన్‌పై ట్రోలింగ్‌!)

‘రహానే చాలా ధైర్యవంతుడే కాదు.. ఒక స్మార్ట్‌ క్రికెటర్‌ కూడా. క్రికెట్‌ జట్లను నడిపించడానికే పుట్టాడు. 2017లో ధర్మశాలలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కూడా రహానే సారథ్యం వహించి జట్టును గెలిపించాడు. 2017లో ఆ మ్యాచ్‌కు మొన్న ఎంసీజీలో  జరిగిన మ్యాచ్‌కు చాలా ఎక్కువగా దగ్గర పోలికలున్నాయి. ఆసీస్‌ క్రికెటర్లు వార్నర్‌-స్మిత్‌లు సెంచరీకి పైగా భాగస్వామ్యం నమోదు చేసిన దశలో కుల్దీప్‌ యాదవ్‌కు బౌలింగ్‌ ఇచ్చి ఆ జోడిని విడగొట్టాడు. కుల్దీప్‌ బౌలింగ్‌లో వార్నర్‌ స్లిప్‌లో రహానేకే క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ సమయంలో కుల్దీప్‌ యాదవ్‌తో బౌలింగ్‌ చేయించడం చాలా గొప్ప ముందుచూపు. అదే అతని కెప్టెన్సీ సక్సెస్‌కు కారణం కూడా. ఆ నేపథ్యంలో టీమిండియాకు రహానే కెప్టెన్‌గా చేయడంలో ఆశ్చర్యం ఏమీలేదు. అతనికి కెప్టెన్‌గా చేసే అన్ని అర్హతలు ఉన్నాయి. అతను కెప్టెన్‌గా చేసే జట్టుకు ఎంతో గౌరవం ఇస్తాడు’ అని ఇయాన్‌ చాపెల్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు