ODI World Cup IND Vs NED Highlights: భారత్‌ 9/9

14 Nov, 2023 01:57 IST|Sakshi

లీగ్‌ దశను అజేయంగా ముగించిన టీమిండియా

చివరి లీగ్‌ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో ఘనవిజయం

శ్రేయస్‌ అయ్యర్, కేఎల్‌ రాహుల్‌ శతకాలు 

రోహిత్, గిల్, కోహ్లి అర్ధ సెంచరీలు

రేపు ముంబైలో న్యూజిలాండ్‌తో భారత్‌ సెమీఫైనల్‌ పోరు  

సంపూర్ణం... లీగ్‌ దశలో భారత్‌ జైత్రయాత్ర! నెదర్లాండ్స్‌ జట్టుతో మిగిలిన లాంఛనాన్ని ఫుల్‌ ప్రాక్టీస్‌తో టీమిండియా ముగించింది. టాపార్డర్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్, విరాట్‌ కోహ్లి ఫిఫ్టీలతో.. మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌; కేఎల్‌ రాహుల్‌ సెంచరీలతో డచ్‌ బౌలర్లను నెట్‌ ప్రాక్టీస్‌లో ఆడుకున్నంత ఈజీగా ఆడేశారు. అనంతరం ఏకంగా 9
మంది భారత బౌలర్లు నెదర్లాండ్స్‌ బ్యాటర్లకు పరీక్ష పెట్టారు. చివరకు భారీ విజయ సాధించిన రోహిత్‌ శర్మ బృందం అజేయంగా లీగ్‌ దశను పూర్తిచేసి బుధవారం న్యూజిలాండ్‌తో సెమీఫైనల్‌ పోరుకు సై అంటోంది.  

బెంగళూరు: వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ వంద శాతం అంకితభావంతో తొమ్మిదికి తొమ్మిది విజయాలతో లీగ్‌ దశను అజేయంగా దాటింది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 160 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై జయభేరి మోగించింది. క్రికెట్‌ కూనపై టాస్‌ గెలవగానే బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిరీ్ణత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (64 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు శతకాన్ని... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శ్రేయస్‌ అయ్యర్‌ (94 బంతుల్లో 128 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ సెంచరీని సాధించారు.

రోహిత్‌ శర్మ (54 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుబ్‌మన్‌ గిల్‌ (32 బంతుల్లో 51; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), కోహ్లి (56 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం నెదర్లాండ్స్‌ 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. తేజ నిడమనూరు (39 బంతుల్లో 54; 1 ఫోర్, 6 సిక్స్‌లు) మెరిపించాడు. బౌలర్లలో బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలా 2 వికెట్లు తీస్తే... కోహ్లి, రోహిత్‌ శర్మ చెరో వికెట్‌ పడగొట్టారు. బుధవారం ముంబైలో జరిగే తొలి సెమీఫైనల్లో గత ప్రపంచకప్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌తో భారత్‌ ఆడుతుంది.  

ఐదుగురూ చితగ్గొట్టారు...
ఓపెనర్లు రోహిత్‌ బౌండరీలతో... శుబ్‌మన్‌ సిక్సర్లతో భారత్‌ 10 ఓవర్లలోనే 91/0 స్కోరు చేసింది. 30 బంతుల్లోనే గిల్‌ ఫిఫ్టీ పూర్తవగానే నిష్క్రమించాడు. 100 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యానికి తెరపడింది. కోహ్లి వచ్చాక కెపె్టన్‌ రోహిత్‌ 44 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. కాసేపటికే అతనూ పెవిలియన్‌ చేరాడు. కోహ్లి, అయ్యర్‌ జోడీ కూడా పాతుకుపోవడంతో డచ్‌ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. కోహ్లి 53 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకోగా, భారత్‌ స్కోరు 29వ ఓవర్లో 200 దాటింది. అక్కడే కోహ్లి వికెట్‌ పడింది. ఇక్కడితో అర్ధశతకాల ఆట ముగియగా... శ్రేయస్‌ అయ్యర్, కేఎల్‌ రాహుల్‌ శతకాల బ్యాటింగ్‌ను చూపెట్టారు.

48 బంతుల్లో అయ్యర్, 40 బంతుల్లో రాహుల్‌ అర్ధశతకాలు సాధించారు. 42వ ఓవర్లో భారత్‌ 300 పరుగులు చేయగా... ఆ తర్వాత రాహుల్‌ ఆట పూర్తిగా మారింది. పరుగుల వేగం పుంజుకుంది. అయ్యర్‌ కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో ఆఖరి 8.2 ఓవర్లలోనే భారత్‌ 110 పరుగులు చేసింది. 49వ ఓవర్లో అయ్యర్‌ మూడు సిక్స్‌లు, ఒక బౌండరీతో 25 పరుగులు పిండుకుంటే... ఆఖరి ఓవర్లో తొలి రెండు బంతుల్ని సిక్సర్లుగా బాదిన రాహుల్‌ 62 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. దీంతో భారత్‌ స్కోరు 400 మార్క్‌ దాటింది. ఐదో బంతికి రాహుల్‌ అవుటయ్యాడు. రాహుల్, అయ్యర్‌ 208 పరుగులు జోడించి ప్రపంచకప్‌ చరిత్రలో నాలుగో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం రికార్డు
సృష్టించారు.  

కూన కుదేల్‌
లక్ష్యం కొండంత ఉన్నా దాని గురించి ఏమాత్రం ఆలోచించకుండా నెదర్లాండ్స్‌ బ్యాటర్లు తమ వంతుకు వచ్చిన ఆటే ఆడారు. మ్యాక్స్‌ ఒ డౌడ్‌ (30), అకెర్మన్‌ (35), సైబ్రాండ్‌ (80 బంతుల్లో 45; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. విజయవాడలో జని్మంచి నెదర్లాండ్స్‌లో స్థిరపడ్డ తేజ నిడమనూరు
మిడిలార్డర్‌లో కాసేపు భారీ సిక్సర్లతో మురిపించాడు. అయ్యర్, కీపర్‌ రాహుల్‌ మినహా 9 మంది భారత తరఫున బౌలింగ్‌కు దిగారు. ప్రధాన
బౌలర్లు బుమ్రా, సిరాజ్, కుల్దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా తలా ఒక చేయివేశారు. తేజ 38 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తికాగానే ఆ మెరుపులకు రోహిత్‌  స్వయంగా బౌలింగ్‌ చేసి ముగింపు పలికాడు.

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) వెస్లీ (బి) లీడే 61; గిల్‌ (సి) తేజ (బి) మీకెరన్‌ 51; కోహ్లి (బి) మెర్వ్‌ 51; అయ్యర్‌ (నాటౌట్‌) 128; రాహుల్‌ (సి) సైబ్రాండ్‌ (బి) లీడే 102; సూర్యకుమార్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 410.
వికెట్ల పతనం: 1–100, 2–129, 3–200, 4–408.
బౌలింగ్‌: ఆర్యన్‌ దత్‌ 7–0–52–0, వాన్‌ బిక్‌ 10–0–107–0, అకెర్మన్‌ 3–0–25–0, మీకెరన్‌ 10–0–90–1, వాన్‌డెర్‌ మెర్వ్‌ 10–0–53–1, బస్‌ డి లీడే 10–0–82–2.

నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌: వెస్లీ (సి) రాహుల్‌ (బి) సిరాజ్‌ 4; ఒ డౌడ్‌ (బి) జడేజా 30; అకెర్మన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్‌ 35; సైబ్రాండ్‌ (బి) సిరాజ్‌ 45; ఎడ్వర్డ్స్‌ (సి) రాహుల్‌ (బి) కోహ్లి 17; లీడే (బి) బుమ్రా 12; తేజ (సి) షమీ (బి) రోహిత్‌ 54; వాన్‌ బిక్‌ (బి) కుల్దీప్‌ 16; మెర్వ్‌ (సి) షమీ (బి) జడేజా 16; ఆర్యన్‌ (బి) బుమ్రా 5; మీకెరన్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (47.5 ఓవర్లలో ఆలౌట్‌) 250.
వికెట్ల పతనం: 1–5, 2–66, 3–72, 4–111, 5–144, 6–172, 7–208, 8–225 9–236, 10–250. 
బౌలింగ్‌: బుమ్రా 9–1–33–2, సిరాజ్‌ 6–1–29–2, షమీ 6–0–41–0, కుల్దీప్‌ 10–1–41–2, జడేజా 9–0–49–2, కోహ్లి 3–0–13–1, గిల్‌ 2–0–11–0, సూర్యకుమార్‌ 2–0–17–0, రోహిత్‌ 0.5–0–7–1.

9: ఒకే ప్రపంచకప్‌లో భారత్‌ వరుసగా 9 మ్యాచ్‌ల్లో గెలుపొందడం ఇదే తొలిసారి. 2003 ప్రపంచకప్‌లో భారత్‌ వరుసగా 8 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఆ్రస్టేలియా జట్టు 2003, 2007 ప్రపంచకప్‌లలో వరుసగా 11 మ్యాచ్‌ల్లో గెలిచి చాంపియన్‌గా నిలిచింది.

7: వన్డేల్లో 400 అంతకంటే ఎక్కువ స్కోరు చేయడం భారత్‌కిది ఏడోసారి. దక్షిణాఫ్రికా జట్టు అత్యధికంగా 8 సార్లు ఈ మైలురాయిని దాటింది.  

9: ప్రపంచకప్‌ మ్యాచ్‌లో తొలిసారి భారత్‌ తొమ్మిది మంది బౌలర్లతో బౌలింగ్‌ వేయించింది. గతంలో ఇంగ్లండ్‌ (1987లో శ్రీలంకపై), న్యూజిలాండ్‌ (1992లో పాకిస్తాన్‌పై) జట్లు మాత్రమే తొమ్మిది మంది బౌలర్లకు అవకాశం ఇచి్చంది.  

24: ఈ ఏడాది వన్డేల్లో భారత్‌ సాధించిన విజయాలు. 1998లోనూ భారత్‌ అత్యధికంగా 24 వన్డేల్లో గెలిచింది.  

60: ఒకే ఏడాది వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ (60) నిలిచాడు. 2015లో ఏబీ డివిలియర్స్‌ 58 సిక్స్‌లు కొట్టాడు.

215: ఈ ఏడాది భారత జట్టు 30 వన్డేలు ఆడి కొట్టిన సిక్స్‌లు. 2019లో వెస్టిండీస్‌ అత్యధికంగా 209 సిక్స్‌లు కొట్టింది.  

మరిన్ని వార్తలు