పంత్‌కు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోషన్‌పై బ్యాటింగ్‌ కోచ్‌ స్పందన

26 Jan, 2021 15:58 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆసీస్‌ పర్యటనలో ఆఖరి రెండు టెస్టుల్లో రిషబ్‌ పంత్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా పంపడంపై టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ స్పందించాడు. టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సలహా మేరకే పంత్‌కు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోషన్‌ లభించినట్లు ఆయన పేర్కొన్నారు. సిడ్నీ టెస్టులో బ్యాటింగ్‌ టాప్‌ ఆర్డర్‌ మొత్తం రైట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్లు కావడంతో ప్రత్యర్ధి బౌలింగ్‌పై ఎదురుదాడి చేసేందుకు రైట్‌, లెఫ్‌ హ్యాండ్‌ కాంబినేషన్‌ అయితే బాగుంటుందన్న విరాట్‌ సలహా మేరకే పంత్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపామని ఆయన చెప్పుకొచ్చాడు. 

సాధారణంగా పంత్‌ ఆరు లేదా ఏడో స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చేది. అయితే, ఆసీస్‌తో జరిగిన ఆఖరి టెస్టుల్లో పంత్‌ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కీలక ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌కు చారిత్రక సిరీస్‌ విజయాన్ని అందించడంలో కీలకపాత్ర పోషించాడు. సిడ్నీ టెస్టులో భారత్‌ భారీ లక్ష్యాన్ని(407 పరుగులు) ఛేదించాల్సి ఉండగా.. పంత్‌ ఐదో స్థానంలో బరిలోకి దిగి కీలకమైన 97 పరుగులు చేయడమే కాకుండా మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలక భూమిక పోషించాడు. 

ఇక ఆఖరిదైన బ్రిస్బేన్‌ టెస్టులో పంత్‌ చివరి దాకా క్రీజ్‌లో నిలిచి(89 నాటౌట్‌) భారత్‌కు చారిత్రక సిరీస్‌ విజయాన్నందించడంలో కీలకంగా వ్యవహరించాడు. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అసలు ఏ అంచనాలు లేకుండా అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన పంత్‌.. సిరీస్‌లో భారత్‌ తరపున అత్యధిక పరుగులు(3 టెస్టుల్లో 68.50 సగటుతో 274 పరుగులు) సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 
 

మరిన్ని వార్తలు