IND VS SA ODI Series: అర్ష్‌దీప్‌ సింగ్‌ ఖాతాలో పలు రికార్డులు

22 Dec, 2023 09:02 IST|Sakshi

సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆధ్యాంతం అద్భుతంగా రాణించి ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు గెలుచుకున్న అర్ష్‌దీప్‌ సింగ్‌ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టిన అర్ష్‌దీప్‌.. మునాఫ్‌ పటేల్‌ తర్వాత సౌతాఫ్రికా గడ్డపై అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2010/11 సిరీస్‌లో మునాఫ్‌ 5 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. 

సిరీస్‌లో భాగంగా జోహనెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల ఘనత సాధించిన అర్ష్‌దీప్‌.. మూడో వన్డేలో సైతం 4 వికెట్లతో చెలరేగడంతో సౌతాఫ్రికాతో జరిగిన వన్డేల్లో అత్యధికసార్లు (2) నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన భారత పేసర్‌గా అరుదైన ఘనత సాధించాడు. అలాగే సౌతాఫ్రికాలో అత్యధిక సార్లు (2) నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా, ఓవరాల్‌గా ఐదో విజిటింగ్‌ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 

కాగా, పార్ల్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో అర్ష్‌దీప్‌ సింగ్‌ (4/30), సంజూ శాంసన్‌ (108) చెలరేగడంతో టీమిండియా 78 పరుగుల తేడాతో గెలుపొంది, 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 50 ఓవర్లలో  8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూతో పాటు తిలక్‌ వర్మ (52) కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖర్లో రింకూ సింగ్‌ (38) తనదైన స్టయిల్‌లో మెరుపులు మెరిపించాడు.

అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా.. అర్ష్‌దీప్‌ సింగ్‌ , వాషింగ్టన్‌ సుందర్‌ (2/38), ఆవేశ్‌ ఖాన్‌ (2/45), అక్షర్‌ పటేల్‌ (1/48), ముకేశ్‌ కుమార్‌ (1/56) రాణించడంతో 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. 

>
మరిన్ని వార్తలు