Hardik Pandya: మేము ఓడిపోయినా పర్లేదనుకున్నా! అందుకే ఇలా.. పాండ్యా కామెంట్స్‌ వైరల్‌

4 Jan, 2023 12:39 IST|Sakshi

India vs Sri Lanka, 1st T20I - Hardik Pandya- Axar Patel: ‘‘ఈ మ్యాచ్‌లో మేము ఓడిపోయినా ఫర్వాలేదనుకున్నా. కీలక మ్యాచ్‌లు, టోర్నీల్లో రాణించాలంటే జట్టును ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టకతప్పదు. ద్వైపాక్షిక సిరీస్‌లలో టీమిండియా మెరుగ్గా ఆడుతోంది. అందుకే ఈరోజు ఇలాంటి సవాలును స్వీకరించేందుకు జట్టును సిద్ధం చేశాను.

నిజం చెప్పాలంటే.. ఈరోజు యువ ఆటగాళ్లంతా కలిసి కఠిన పరిస్థితులను అధిగమించి జట్టును ఓటమి గండం నుంచి గట్టెక్కించారు’’ అని టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అన్నాడు. కాగా శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్‌లో ఘన విజయంతో కొత్త ఏడాదిని ఆరంభించాలనుకున్న భారత జట్టు గెలుపు కోసం ఆఖరి బంతి వరకు పోరాడాల్సి వచ్చింది.

వాళ్లే గెలిపించారు
అయితే, తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్న యువ జట్టు.. ఆసియా చాంపియన్‌ లంకను ఓడించగలిగింది. బ్యాటింగ్‌ ఆర్డర్లో ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హుడా, అక్షర్‌ పటేల్‌ రాణించగా.. బౌలింగ్‌ విభాగంలో అరంగేట్ర బౌలర్‌ శివం మావికి తోడు ఉమ్రాన్‌ మాలిక్‌, హర్షల్‌ పటేల్‌ రాణించారు.

అందుకే ఆఖరి ఓవర్‌లో అక్షర్‌ చేతికి బంతి
ఇదిలా ఉంటే, ఆఖరి ఓవర్లో విజయానికి 13 పరుగుల అవసరమైన తరుణంలో పాండ్యా బౌలింగ్‌ చేస్తాడనుకుంటే.. అనూహ్యంగా బంతిని అక్షర్‌ చేతికి ఇచ్చాడు. ఈ క్రమంలో సారథి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అక్షర్‌ ఆరంభంలో కాస్త తడబడ్డా తన బాధ్యతను విజయవంతంగా నెరవేర్చగలిగాడు. ఈ ఓవర్లో అతడు నమోదు చేసిన గణాంకాలు వరుసగా వైడ్‌, 1, 0, 6, 0, వికెట్‌, వికెట్‌.

దీంతో రెండు పరుగుల తేడాతో టీమిండియా విజయం ఖరారైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం పాండ్యా మాట్లాడుతూ ఆఖరి ఓవర్లో బంతిని అక్షర్‌కు ఇవ్వడంపై స్పందిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కఠిన పరిస్థితులను జయిస్తేనే.. మెగా టోర్నీల్లో రాణించగలమనే తన ఆలోచనను ఈ మ్యాచ్‌ సందర్భంగా అమలు చేసినట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

చదవండి: Deepak Hooda: అసభ్య పదజాలం వాడిన హుడా! ఇంత నీచంగా మాట్లాడతావా అంటూ..
Umran Malik: బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన ఉమ్రాన్‌ మాలిక్‌.. త్వరలోనే అక్తర్‌ను కూడా!

>
మరిన్ని వార్తలు