న్యూఢిల్లీ: ఈ ఏడాది చివర్లో(డిసెంబర్) భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈమేరకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు శుక్రవారం నిర్ధారించింది. పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్ట్లు, మూడు వన్డేలు, నాలుగు టీ 20 మ్యాచ్లు ఆడనుంది. డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే ఈ ద్వైపాక్షిక సిరీస్.. వచ్చే ఏడాది జనవరి 25న ముగుస్తుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా జరిగే ఈ సిరీస్లోని తొలి టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 17న జొహన్నెస్బర్గ్ వేదికగా జరగనుంది. అనంతరం సెంచూరియన్ వేదికగా రెండో టెస్ట్ డిసెంబర్ 26న(బాక్సింగ్ డే టెస్ట్), మూడో టెస్ట్ జొహన్నెస్బర్గ్ వేదికగా జనవరి 3న మొదలవుతాయి.
ఇక మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డే జనవరి 11న, రెండో వన్డే జనవరి 14న, మూడో వన్డే జనవరి 19న జరగనున్నాయి. ఆతర్వాత నాలుగు టీ20 మ్యాచ్లు వరుసగా జనవరి 19(పార్ల్), జనవరి 21(కేప్టౌన్), జనవరి 23(పార్ల్), జనవరి 26న(పార్ల్) షెడ్యూలయ్యాయి. టీమిండియా చివరిసారిగా 2018లో దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ఆ పర్యటనలో భారత్ టెస్ట్ సిరీస్ను కోల్పోగా.. వన్డే, టీ20 సిరీస్లను గెలుచుకుంది. ఇక ఇరు జట్ల మధ్య గతేడాది మార్చిలో(భారత పర్యటన) షెడ్యూలైన పరిమిత ఓవర్ల సిరీస్.. కరోనా కారణంగా పూర్తిగా రద్దైన సంగతి తెలిసిందే.
చదవండి: స్టార్ ఆటగాళ్లకు మొండిచేయి.. దక్షిణాఫ్రికా టీ20 జట్టు ఇదే