IPL 2022: కోహ్లి కాదు.. ఇప్పుడు డుప్లెసిస్‌ స్టార్‌ అయ్యాడు! కేవలం ఆటగాడినన్న విషయం గ్రహించి..

20 Apr, 2022 08:35 IST|Sakshi
విరాట్‌ కోహ్లి(PC: IPL/BCCI)

IPL 2022- Virat Kohli- RCB: టీమిండియా మాజీ కెప్టెన్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లి ఐపీఎల్‌-2022లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. గత సీజన్‌తో ఆర్సీబీ కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన కోహ్లి.. ఇకపై బ్యాటర్‌గా జట్టుకు సేవలు అందిస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సారథ్య బాధ్యతల భారం తొలగిపోతే కోహ్లి బ్యాట్‌ ఝులిపించడం ఖాయమని, మునుపటి రన్‌మెషీన్‌ను చూడవచ్చని అభిమానులు ఆశపడ్డారు. కానీ అలా జరగడం లేదు. 

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో ఒకటీ రెండు మినహా మిగతా మ్యాచ్‌లలో కోహ్లి చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగి మరోసారి నిరాశపరిచాడు. ఇక ఈ ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో కోహ్లి చేసిన పరుగులు 119. అత్యధిక స్కోరు 48. ఈ గణాంకాలను బట్టి కోహ్లి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 


కెవిన్‌ పీటర్సన్‌

ఈ పరిణామాల నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ కోహ్లి గురించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తాను ఇప్పుడు కెప్టెన్‌ కాదని, సాధారణ ఆటగాడిననే విషయాన్ని కోహ్లి త్వరగా గ్రహించాలని సూచించాడు. ఈ మేరకు.. ‘‘షో ఏదైనా తానే స్టార్‌గా ఉండాలని విరాట్‌ కోహ్లి కోరుకుంటాడు. అయితే, ఇప్పుడు ఫాఫ్‌ డుప్లెసిస్‌ స్టార్‌ అయ్యాడు. నావను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. 

ఫాఫ్‌నకు హోటల్‌లో విలాసవంతమైన గది కేటాయించారో లేదో తెలియదు కానీ.. కోహ్లికి మాత్రం ఫాఫ్‌ కంటే పెద్ద గదినే ఇస్తారు. నిజానికి ఓ కెప్టెన్‌ మళ్లీ సాధారణ ఆటగాడిగా మారాలంటే కాస్త కష్టమే. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో నీ పాత్ర ఉండకపోవచ్చు. మునుపటిలా ఆధిపత్యం ప్రదర్శించే వీలు ఉండకపోవచ్చు. 

కెప్టెన్‌గా ఉన్నపుడు అభిమానులు, సహచర ఆటగాళ్లు నిన్ను చూసే విధానం వేరుగా ఉంటుంది. అయితే, ఓ సోల్జర్‌(ఆటగాడి)గా నువ్వు మళ్లీ జట్టులో ఇమిడిపోతావా లేదా అన్నది పెద్ద ప్రశ్న. నిజానికి అలా ఉండటం మనసుకు కష్టం’’ అని పీటర్సన్‌ పేర్కొన్నాడు. కోహ్లి ఇంకా పూర్తిగా ఫామ్‌లోకి రాలేదని, అందుకు ఇంకాస్త సమయం పడుతుందని అభిప్రాయపడ్డాడు. 

ఇక నెట్స్‌లో కోహ్లి వార్మప్‌ చేయడం చూశానన్న పీటర్సన్‌.. ‘‘తన పనేదో తాను చేసుకుంటున్నాడు. ఒక నవ్వు లేదు. హెలో చెప్పడాలు లేవు. ఎవరితోనూ పెద్దగా కలిసేది లేదు.. ప్రతిసారి.. ‘‘నేను ఆటపై దృష్టి పెట్టాను. సాధించి తీరాల్సిందే’’ అన్నట్లుగా సీరియస్‌గా ఉంటున్నాడు’’ అని వ్యాఖ్యానించాడు. కోహ్లి ఒత్తిడిలో కూరుకుపోయాడని, దానిని అధిగమిస్తేనే మునుపటిలా బ్యాట్‌ ఝులిపించగలడన్నాడు. ఈ మేరకు స్టార్‌ స్పోర్ట్స్ షోలో పీటర్సన్‌ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

ఇక ఆర్సీబీ పగ్గాలు చేపట్టిన డుప్లెసిస్‌ ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా రాణిస్తూ అభిమానులు ప్రశం‍సలు అందుకుంటున్నాడు. లక్నోతో మ్యాచ్‌లో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌(96 పరుగులు) ఆడి అతడు ఆర్సీబీని గెలిపించిన సంగతి తెలిసిందే.  తాజా గెలుపుతో పాయింట్ల పట్టికలో బెంగళూరు రెండో స్థానాని(10 పాయింట్లు)కి చేరుకుంది. 

చదవండి: IPL 2022: సెంచరీ మిస్‌.. అయితేనేం జట్టును గెలిపించాడు! జోష్‌లో బెంగళూరు!

>
మరిన్ని వార్తలు