'కోహ్లి, షమీ, అయ్యర్‌ హెడ్‌లైన్స్‌లో ఉంటారు.. కానీ అతడే రియల్‌ హీరో'

16 Nov, 2023 18:34 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వాంఖడే వేదికగా జరిగిన న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 70 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత జట్టు ఫైనల్‌కు దూసుకువెళ్లింది. టాస్‌ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసింది.  విరాట్‌ కోహ్లి(117), శ్రేయస్‌ అయ్యర్‌(105) సెంచరీలతో చెలరేగగా..  శుబ్‌మన్‌ గిల్‌(80) పరుగులతో రాణించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో  న్యూజిలాండ్‌ 327 పరుగులకు ఆలౌట్‌ అయింది. 

భారత బౌలర్లలో షమీ 7 వికెట్లతో చెలరేగాడు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై ఇంగ్లండ్‌ మాజీ సారథి నాజర్ హుస్సేన్ ప్రశంసలు వర్షం కురిపించాడు. కోహ్లి, షమీ, అయ్యర్ విజయంలో కీలక పాత్ర పోషించినప్పటికీ రోహిత్‌ శర్మనే రియల్‌ హీరో అని హుస్సేన్ కొనియాడాడు.

న్యూజిలాండ్‌పై మ్యాచ్‌ గెలిచిన అనంతరం స్కై స్పోర్ట్స్‌తో నాజర్ హుస్సేన్ మాట్లాడుతూ.. "రేపటి హెడ్‌లైన్స్‌ మొత్తం కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, మహమ్మద్ షమీ గురించే ఉంటాయి. కానీ ప్రస్తుత భారత జట్టు రియల్‌ హీరో మాత్రం రోహిత్‌ శర్మనే. అతడు భారత జట్టు స్ధితిని మార్చాడు. మా కామెంట్రరీ బాక్స్‌లో దినేష్ కార్తీక్‌ ఉన్నాడు. టీ20 వరల్డ్‌కప్‌-2023లో భాగంగా సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడింది.

ఆడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌కూ డికేతో కలిసి మేము వ్యాఖ్యాతలగా వ్యవహరించాము. ఆ రోజు భారత్‌ బ్యాటింగ్‌లో తీవ్ర నిరాశపరిచింది. భయపడి ఆడుతూ తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్‌ 10 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. కానీ ఈ రోజు మాత్రం ఇండియా ఎటువంటి భయం లేకుండా ఆడింది. అందుకు కారణం రోహిత్‌ శర్మనే. అతడు మొదటే మంచి ఆరంభాన్ని అందిస్తున్నాడు. కచ్చితంగా ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి "అని చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు