టీమిండియాపై పాక్‌ గెలుపు.. సంబురాలు చేసుకున్న భార్యపై కేసు పెట్టిన భర్త

7 Nov, 2021 18:01 IST|Sakshi

UP Man Files Police Case Against Wife For Celebrating Pakistan Win Over Team India: టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా భారత్‌-పాక్‌ల మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌ ఓ పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. ఈ మ్యాచ్‌లో పాక్‌ 10 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఓ ఇల్లాలు చేసిన పని ఆమె కాపురాన్ని కూల్చింది. సదరు ఇల్లాలు పాక్‌కు మద్దతు తెలుపుతూ.. భారత్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్న వైనాన్ని జీర్ణించుకోలేకపోయిన భర్త.. ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. షంగన్‌ఖేడాకు చెందిన ఇషాన్ మియా, రబియా షంషీ ఇద్దరు భార్యాభర్తలు. అక్టోబర్‌ 24న పాక్‌ చేతిలో టీమిండియా ఓటమి అనంతరం రబియా, ఆమె కుటుంబ సభ్యులు టపాసులు కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా వాట్సాప్ స్టేటస్‌లోనూ వారి ఆనందాన్ని పంచుకున్నారు. 

దీంతో చిర్రెత్తిపోయిన ఇషాన్.. భార్య రబియా షంషీ, ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భారత ఓటమిని సెలబ్రేట్‌ చేసుకున్న వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో  స్థానిక పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
చదవండి: Chris Gayle: నేనింకా రిటైర్‌ కాలేదు.. ఆ హడావుడి అంతా అందుకే..!

మరిన్ని వార్తలు