జడేజా మ్యాజిక్‌.. డుప్లెసిస్‌ సూపర్‌

19 Sep, 2020 21:28 IST|Sakshi

అబుదాబి: ఐపీఎల్‌-13 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 163 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ముంబై ఇండియన్స్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేస్తుంది అనుకునేలోపే రెండేసి వికెట్లు కోల్పోతూ రావడంతో సాధారణ స్కోరుకే పరిమితమైంది. 16 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేయగా, అందులో నాలుగు వికెట్లు స్వల్ప వ్యవధిలో చేజార్చుకున్నవే.  ఇందులో ఓకే ఓవర్‌లో ముంబై రెండు వికెట్లను కోల్పోవడం గమనార్హం. రవీంద్ర జడేజా వేసిన 15 ఓవర్‌ తొలి బంతికి సౌరవ్‌ తివారీ(42) భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్‌ వద్ద దొరికేశాడు. బ్యాక్‌వర్డ్‌ స్వేర్‌లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న డుప్లెసిస్‌.. తివారీ ఇచ్చిన క్యాచ్‌ను పట్టే క్రమంలో అదుపు చేసుకోలేక బౌండరీ దాటేశాడు. అయితే పట్టుకున్న బంతిని గాల్లోకి విసిరేసి బౌండరీ లైన్‌ లోపలికి వెళ్లాడు. మళ్లీ వెంటనే వచ్చి సింపుల్‌గా క్యాచ్‌ అందుకున్నాడు దాంతో తివారీ పెవిలియన్‌ చేరాడు. ఆ ఓవర్‌ ఐదో బంతికి హార్దిక్‌ పాండ్యా లాంగాఫ్‌లోకి సిక్స్‌ కొట్టే యత్నం చేశాడు. కానీ అక్కడ కూడా డుప్లెసిస్‌ మరో అద్భుతమైన క్యాచ్‌ను అందుకోవడంతో పాండ్యా ఇన్నింగ్స్‌ సుదీర్ఘంగా సాగలేదు. ఈ రెండు క్యాచ్‌లను డుప్లెసిస్‌ అద్భుతంగా పట్టుకోగా, అవి రెండు జడేజా ఖాతాలోకి వెళ్లాయి. (చదవండి: ఐపీఎల్‌ వీరులు వీరే.. ఈసారి ఎవరో?)

అంతకుముందు జడేజా వేసిన 12 ఓవర్‌లో హార్దిక్‌ పాండ్యా ఐదు, ఆరు బంతుల్ని సిక్స్‌లుగా కొట్టి మంచి ఊపు మీద కనిపించాడు. కానీ అదే ఎంతసేపో సాగలేదు. హార్దిక్‌ పాండ్యా 10 బంతుల్లో రెండు సిక్స్‌లు కొట్టి 14 పరుగులు చేసి ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత లుంగీ ఎన్‌గిడి వేసిన 17 ఓవర్‌ తొలి బంతికి కృనాల్‌ పాండ్యా(3) పెవిలియన్‌ చేరాడు. లెగ్‌సైడ్‌ వేసిన బంతిని ఫ్లిక్‌ చేయబోయిన కృనాల్‌.. ధోనికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ముంబై 16.1 ఓవర్ల వద్ద కృనాల్‌ వికెట్‌ను కోల్పోయింది. కాసేపటికి పొలార్డ్‌(18) కూడా ఔటయ్యాడు.  దాంతో ముంబైకి భారీ స్కోరు రాలేదు.

ఈ మ్యాచ్‌లో తొలుత సీఎస్‌కే టాస్‌ గెలవడం ద్వారా బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు మంచి ఆరంభం లభించింది. దీపక్‌ చాహర్‌ వేసిన తొలి ఓవర్‌ మొదటి బంతినే రోహిత్‌ ఫోర్‌ కొట్టాడు. ఆపై డీకాక్‌కు కూడా బ్యాట్‌ ఝుళింపించాడు.  వీరిద్దరూ నాలుగు ఓవర్ల ముగిసేసరికి 45 పరుగులు సాధించి రన్‌రేట్‌ను పదికి పైగా ఉంచారు. కాగా, మ్యాచ్‌ ఒక్కసారిగా ఛేంజ్‌ అయిపోయింది. సీఎస్‌కే స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా వేసిన ఐదో ఓవర్‌ నాల్గో బంతికి రోహిత్‌(12) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, క్వింటాన్‌ డీకాక్‌(33) ఆ తర్వాత ఓవర్‌లో పెవిలియన్‌ చేరాడు. పేసర్‌ సామ్‌ కరాన్‌ వేసిన ఆరో ఓవర్‌ తొలి బంతికి డీకాక్‌(33) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. డీకాక్‌ 20 బంతుల్లో ఐదు ఫోర్లు కొట్టాడు.

కరాన్‌ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన డీకాక్‌.. వాట్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆ సమయంలో సూర్యకుమార్‌ యాదవ్‌(17), సౌరవ్‌ తివారీల జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి 44 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ ఔటయ్యాడు. అప్పుడు తివారీకి హార్దిక్‌ పాండ్యా కలవడంతో స్కోరు  కాసేపు పరుగులు పెట్టింది. కానీ అది ఎంతోసేపు సాగలేదు. తివారీ,హార్దిక్‌లు వరుసగా పెవిలియన్‌ చేరడంతో ఆ తర్వాత వచ్చిన కృనాల్‌, పొలార్డ్‌లు కూడా రాణించకపోవడంతో ముంబై ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఎన్‌గిడి మూడు వికెట్లు సాధించగా, జడేజా,  దీపక్‌ చాహర్‌ తలో రెండు వికెట్లు సాధించారు, సామ్‌ కరాన్‌, పీయూష్‌ చావ్లా తలో వికెట్‌ తీశారు.

మరిన్ని వార్తలు