సాధారణ లక్ష్యమే.. ఆర్సీబీ గెలిచేనా?

3 Oct, 2020 17:34 IST|Sakshi

అబుదాబి: ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌  155 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్తాన్‌.. టాపార్డర్‌ ఆటగాళ్లైన స్టీవ్‌ స్మిత్‌(5), జోస్‌ బట్లర్‌(22), సంజూ శాంసన్‌(4) వికెట్లను ఐదు ఓవర్లలోపే కోల్పోయింది. ఇసుర ఉదాన వేసిన మూడో ఓవర్‌ నాల్గో బంతికి స్మిత్‌ బౌల్డ్‌ కాగా, కాసేపటికి సైనీ బౌలింగ్‌లో బట్లర్‌ పెవిలియన్‌ చేరాడు. దేవదూత్‌ పడిక్కల్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో బట్లర్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఇక సంజూ శాంసన్‌ కూడా విఫలయ్యాడు. దాంతో 31 పరుగులకే రాజస్తాన్‌ మూడు వికెట్లు కోల్పోయింది. ఆపై రాబిన్‌ ఊతప్ప-లామ్రోర్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కానీ ఊతప్ప(17) నాల్గో వికెట్‌గా ఔట్‌ కావడంతో రాజస్తాన్‌ను లామ్రోర్‌ ఆదుకున్నాడు. 

ఒకవైపు వికెట్లు పడుతున్నా లామ్రోర్‌ మాత్రం నిలకడగా ఆడాడు.  39 బంతుల్లో 1 ఫోర్‌, 3సిక్స్‌లతో 47 పరుగులు సాధించి రాజస్తాన్‌ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు. ఇది లామ్రోర్‌కు ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌. చివర్లో ఆర్చర్‌(16 నాటౌట్‌; 10 బంతుల్లో 1ఫోర్‌, 1సిక్స్‌)), రాహుల్‌ తెవాటియా(24 నాటౌట్‌; 12 బంతుల్లో 3 సిక్స్‌లు)లు బ్యాట్‌ ఝుళిపించడంతో రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో చహల్‌ మూడు వికెట్లు సాధించగా, ఉదాన రెండు వికెట్లు తీశాడు. సైనీకి వికెట్‌ దక్కింది. 

ఫస్ట్‌ బాల్‌కే  వికెట్‌..
రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో భాగంగా తన తొలి ఓవర్‌ను వేసిన ఆర్సీబీ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌.. వచ్చీ రావడంతోనే మంచి బ్రేక్‌ ఇచ్చాడు. తన ఓవర్‌లో తొలి బంతికే డేంజరస్‌ బ్యాట్స్‌మన్‌ సంజూ శాంసన్‌ను ఔట్‌ చేశాడు. చహల్‌ వేసిన బంతిని డిఫెన్స్‌ ఆడబోయిన సంజూ.. రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. కాగా, ఈ క్యాచ్‌ను పట్టే క్రమంలో కాస్త సందిగ్థం నెలకొంది. చహల్‌ బంతిని గ్రౌండ్‌కు టచ్‌ చేశాడా అనే దానిపై థర్డ్‌ అంపైర్‌ నిర్ణయానికి వెళ్లారు ఫీల్డ్‌ అంపైర్లు. అయితే పలు కోణాల్లో ఆ క్యాచ్‌ను పరిశీలించిన తర్వాత బంతి గ్రౌండ్‌కు టచ్‌ కాలేదని థర్డ్‌ అంపైర్లు తేల్చారు.. బంతి క్రింద చహల్‌ వేళ్లు ఉండటంతో అది ఔట్‌గా ఇచ్చారు. కానీ బంతి గ్రౌండ్‌కు తగిలినట్లు కొన్ని కోణాలు కనబడింది. ఇది ఔటా అంటూ రాజస్తాన్‌ రాయల్స్‌ అభిమానులు ట్రోల్స్‌ చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు