India Bangladesh Tour: టీమిండియాకు భారీ షాక్‌.. గాయంతో స్టార్‌ ప్లేయర్‌ ఔట్‌..!

23 Nov, 2022 20:09 IST|Sakshi

India Tour Of Bangladesh 2022: బంగ్లాదేశ్‌ పర్యటనకు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. అందరూ ఊహించిన విధంగానే స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా జట్టుకు దూరం కానున్నాడని ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో ఓ కథనంలో పేర్కొంది. మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోని జడ్డూ.. బంగ్లాదేశ్‌తో వన్డే, టెస్ట్‌ సిరీస్‌లకు అందుబాటులో ఉండడని సదరు వెబ్‌సైట్‌ వెల్లడించింది. వన్డేల్లో జడేజా స్థానాన్ని షాబాజ్‌ అహ్మద్‌, టెస్ట్‌ల్లో సౌరభ్‌ కుమార్‌ భర్తీ చేసే అవకాశం ఉందని తెలిపిం‍ది. అయితే ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కాగా, గాయపడిన జడ్డూ స్థానంపై ప్రస్తుతం క్రికెట్‌ సర్కిల్స్‌లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జడేజా స్థానాన్ని మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ సూర్యకుమార్‌ భర్తీ చేస్తాడని అభిమానులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్న సూర్య.. బంగ్లా సిరీస్‌లో టెస్ట్‌ అరంగేట్రం చేయడం ఖాయమని పందెలు సైతం కాస్తున్నారు. అయితే, తాత్కాలిక సెలెక్షన్‌ కమిటీ మాత్రం ఆల్‌రౌం‍డర్‌ సౌరభ్‌ కుమార్‌ పేరునే పరిశీలస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు రవీం‍ద్ర జడేజా.. బంగ్లాదేశ్‌ టూర్‌కు అందుబాటులో ఉండకపోవడంపై మరో ప్రచారం కూడా నడుస్తుంది. జడేజా భార్య రివాబా జడేజా గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది కాబట్టి, కావాలనే జడ్డూ గాయాన్ని బూచిగా చూపించి బంగ్లా టూర్‌ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నాడని అనుకుంటున్నారు. గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్‌ 1, 5 తేదీల్లో జరుగనుండగా.. బంగ్లాదేశ్‌ సిరీస్‌ డిసెంబర్‌ 4న మొదలుకానున్న విషయం తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు