ఆర్సీబీని కట్టడి చేసిన సన్‌రైజర్స్‌

31 Oct, 2020 21:08 IST|Sakshi

షార్జా:  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 121 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను జోష్‌ ఫిలెప్పి-దేవదూత్‌ పడిక్కల్‌లు ఆరంభించారు. అయితే ఆర్సీబీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.  సందీప్‌ శర్మ వేసిన మూడో ఓవర్‌ ఐదో బంతికి పడిక్కల్‌(5) బౌల్డ్‌ అయ్యాడు. అనంతరం విరాట్‌ కోహ్లి(7) కూడా నిరాశపరిచాడు. సందీప్‌ శర్మ వేసిన మరో ఓవర్‌లో విలియమ్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి కోహ్లి ఔటయ్యాడు.

ఆ తరుణంలో ఫిలెప్పి- ఏబీ డివిలియర్స్‌లు ఇన్నింగ్స్‌ చక్కదిద్దే యత్నం చేశారు. ఈ జోడి 43 పరుగులు జత చేసిన తర్వాత డివిలియర్స్‌(24) పెవిలియన్‌ చేరాడు. నదీమ్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ శర్మ క్యాచ్‌ పట్టడంతో ఏబీ ఇన్నింగ్స్‌ ముగిసింది. కాసేపటికి ఫిలెప్పి((32) కూడా ఔట్‌ కావడంతో ఆర్సీబీ 76 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  వాషింగ్టన్‌ సుందర్‌(21) ఫర్వాలేదనిపించడంతో ఆర్సీబీ వంద పరుగుల మార్కును  దాటింది. క్రిస్‌ మోరిస్‌(3), ఇసురు ఉదాన(0)లను ఒకే ఓవర్‌లో హోల్డర్‌ ఔట్‌ చేయడంతో ఆర్సీబీ సాధారణ స్కోరుకే పరిమితమైంది. గుర్‌కీరత్‌ మన్‌(15 నాటౌట్‌) కడవరకూ నిలబడటంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో  7 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది.  సన్‌రైజర్స్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ, హోల్డర్‌లు  చెరో రెండు వికెట్లు సాధించగా, నటరాజన్‌, నదీమ్‌, రషీద్‌ఖాన్‌లు తలో వికెట్‌ తీశారు.

మరిన్ని వార్తలు