World Cup 2023: ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు భారీ షాక్‌.. ఇక కష్టమే

22 Oct, 2023 20:20 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో వరుస అపజయాలతో సతమతమవుతున్న ఇంగ్లండ్‌కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ రీస్ టోప్లీ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టోప్లీ చూపుడు వేలికి గాయమైంది.

దీంతో అతడు ఫీల్డ్‌ను వదిలి వెళ్లిపోయాడు. అయితే ఫిజియో వద్ద చికిత్స తీసుకుని టోప్లీ తిరిగి మళ్లీ మైదానంలోకి వచ్చాడు. నొప్పితో బాధపడుతుంటానే 6 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. ఓవరాల్‌గా 8.5 ఓవర్లు బౌలింగ్‌ చేసిన టోప్లీ 88 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. 

అయితే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ అనంతరం  టోప్లీని స్కాన్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే స్కానింగ్‌లో ఎడమ చూపుడు ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. దీంతో అతడు టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు దృవీకరించింది.

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్,  సర్రే సీమర్ రీస్ టాప్లీ చేతి వేలికి గాయమైంది. దీంతో వన్డే ప్రపంచకప్ మధ్యలో నుంచి తప్పుకున్నాడు. టోప్లీ రాబోయే 24 గంటల్లో తిరిగి యూకేకు రానున్నాడు అని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ఒక​ ప్రకటనలో పేర్కొంది.

కాగా దక్షిణాఫ్రికా చేతిలో 229 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ ఓటమి పాలైంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌లో ఇంగ్లీష్‌ జట్టు విజయం సాధించింది. ఇంగ్లండ్‌ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్ధానంలో ఉంది.
చదవండి: WC 2023: చరిత్ర సృష్టించిన మహ్మద్‌ షమీ.. తొలి భారత బౌలర్‌గా

మరిన్ని వార్తలు