మరో క్రికెట్‌ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సంజయ్‌ దత్‌

25 Jun, 2023 17:00 IST|Sakshi

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ రోజుల వ్యవధిలోనే రెండు క్రికెట్‌ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. కొద్దిరోజుల కిందట జింబాబ్వే లీగ్‌లోని (జిమ్‌-ఆఫ్రో టీ10 లీగ్‌) హరారే హరికేన్స్‌ ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు ప్రకటించిన సంజూ బాబా.. తాజాగా లంక ప్రీమియర్‌ లీగ్‌లోని (శ్రీలంక టీ20 లీగ్‌) బి-లవ్‌ క్యాండీ ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు.

తనతో పాటు ఒమర్‌ ఖాన్‌, షేక్‌ మర్వాన్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ కలిసి బి-లవ్‌ క్యాండీ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నట్లు సంజూ బాబా ప్రకటించాడు. లంక ప్రీమియర్‌ లీగ్‌ 2023 ఎడిషన్‌ బరిలో బి-లవ్‌ క్యాండీ బరిలో నిలువనున్నట్లు తెలిపాడు. కాగా, లంక ప్రీమియర్‌ లీగ్‌ 2023 జులై 30 నుంచి ఆగస్ట్‌ 20 వరకు జరుగనున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే, జిమ్‌ ఆఫ్రో టీ10 లీగ్‌ జూలై 20 నుంచి 29 వరకు జరుగనుంది. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు (డర్బన్ క్వాలండర్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్, జోబర్గ్ లయన్స్‌, హరారే హరికేన్స్) పాల్గొంటాయి. ఇందులో హరారే హరికేన్స్ ఫ్రాంచైజీని బాలీవుడ్‌ నటుడు సంజయ్ దత్ కొనుగోలు చేశాడు. ఏరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్  సోహన్ రాయ్‌తో కలిసి సంజూ ఈ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నాడు. 

మరిన్ని వార్తలు