IND vs SA: ఆ ముగ్గురు ఆటగాళ్లకి ఇదే చివరి ఛాన్స్!

11 Dec, 2021 14:57 IST|Sakshi

 టీమిండియా పేసర్‌  ఇషాంత్ శర్మకు  దక్షిణాఫ్రికా పర్యటనే చివరి అవకాశం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాతో మూడు టెస్ట్‌లు ఆడనుంది. ఈ పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో  ఇషాంత్‌కు స్ధానం దక్కిన సంగతి తెలిసిందే. అయితే తుది జట్టులో ఇషాంత్‌కు చోటు దక్కడం చాలా కష్టం. ఇప్పటి వరకు 105 టెస్ట్‌ల్లో తన సేవలను భారత జట్టుకు అందించాడు. శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌ల రూపంలో ఇషాంత్‌కు జట్టులో తీవ్రమైన పోటీ ఉంది. ఇషాంత్‌తో పాటు జట్టు సీనియర్‌ ఆటగాళ్లు అజింక్యా రహానే, ఛతేశ్వర్‌ పూజారా భవిష్యత్తు కూడా ఈ సిరీస్‌పైనే ఆధారపడి ఉంది.

"భారత టెస్ట్‌ జట్టు వైస్ కెప్టెన్‌గా రహానె తొలగింపు  ఇషాంత్‌కు ఒక స్పష్టమైన హెచ్చరిక వంటిది. సీనియర్ ఆటగాడిగా ఇషాంత్‌ మరింత రాణించాలి. పుజారా విషయంలో కూడా ఇదే నిజం. పుజారా చాలా కాలంగా జట్టులో ఉన్నాడు. అతడు ప్రస్తుతం ఫామ్‌లో లేడు. కానీ ఒక సీనియర్‌ ఆటగాడిగా  కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడతాడని జట్టు ఆశిస్తోంది.  ఒకవేళ వారు ఈ సిరీస్‌లో అద్బుతంగా రాణిస్తే, తమ టెస్ట్ కెరీర్‌ను పొడిగించుకోగలరు" అని బీసీసీఐ అధికారి  ఒకరు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో తెలిపారు. ఇక సెంచూరియాన్‌ వేదికగా డిసెంబర్‌-26న  భారత్‌- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది. 

భారత టెస్ట్‌ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్‌ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్

మరిన్ని వార్తలు