బెయిర్‌ స్టో షో​..  పంజాబ్‌కు భారీ లక్ష్యం

8 Oct, 2020 21:34 IST|Sakshi

దుబాయ్‌: కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 202 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. డేవిడ్‌ వార్నర్‌(52; 40 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌), బెయిర్‌ స్టో(97; 55 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు)లు రాణించడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ స్కోరును చేయకల్గింది.పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి సన్‌రైజర్స్‌ ముందుగా బ్యాటింగ్‌ తీసుకుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ను వార్నర్‌, బెయిర్‌ స్టోలు ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లను ఆడేసుకుంటూ విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే తొలుత బెయిర్‌ స్టో హాఫ్‌ సెంచరీ సాధించగా, కాసేపటికి వార్నర్‌ అర్థ శతకం సాధించాడు. గత మ్యాచ్‌లకు భిన్నంగా బెయిర్‌ స్టో బ్యాట్‌ ఝుళిపించాడు. పంజాబ్‌ యువ బౌలర్లను టార్గెట్‌ చేస్తూ రెచ్చిపోయి ఆడాడు. అతనికి జతగా వార్నర్‌ స్టైక్‌ రొటేట్‌ చేస్తూ స్కోరు బోర్డుపై రన్‌రేట్‌ తగ్గకుండా చూసుకున్నారు.

కాగా, వార్నర్‌ అర్థ శతకం సాధించిన తర్వాత తొలి వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో ఆరెంజ్‌ ఆర్మీ 160 పరుగుల వద్ద తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఆపై బెయిర్‌ స్టో సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఔటయ్యాడు. వార్నర్‌, బెయిర్‌ స్టోలను రవి బిష్ణోయ్‌ పెవిలియన్‌కు పంపాడు. మనీష్‌ పాండే(1) కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. అర్షదీప్‌ దీప్‌ బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అబ్దుల్‌ సామద్‌(8), ప్రియాం గార్గ్‌(0)లు కూడా స్వల్య వ్యవధిలోనే ఔటయ్యారు. 15 పరుగుల వ్యవధిలో సన్‌రైజర్స్‌ ఐదు వికెట్లను కోల్పోవడంతో రెండొందల పరుగుల మార్కును చేరడం కష్టమనిపించింది. కానీ కేన్‌ విలియమ్సన్‌ (20 నాటౌట్‌; 10 బంతుల్లో 1 ఫోర్‌ 1సిక్స్‌, అభిషేక్‌ శర్మ(12;  6 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌)లు చివర్లో బ్యాట్‌ ఝుళిపించడంతో నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ మూడు వికెట్లు సాధించగా, అర్షదీప్‌ సింగ్‌ రెండు వికెట్లు తీశాడు. మహ్మద్‌ షమీకి వికెట్‌ లభించింది.

మరిన్ని వార్తలు