Suresh Raina: మెగావేలంలో అవమానం.. అక్కడ మాత్రం ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక

20 Mar, 2022 13:33 IST|Sakshi

ఐపీఎల్‌ మెగావేలంలో సురేశ్‌ రైనాకు అవమానం జరిగిన సంగతి తెలిసిందే. లీగ్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాటర్‌గా పేరున్న  రైనాను వేలంలో ఎవరు కొనడానికి ఆసక్తి చూపలేదు. దీంతో రైనా అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. అయితే ఇదే రైనాను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. మాల్దీవులు ప్రభుత్వం ఇచ్చే 'స్పోర్ట్స్ ఐకాన్'​ అవార్డుకు రైనా ఎంపికయ్యాడు.

మొత్తంగా వివిధ దేశాలకు చెందిన 16 మంది క్రీడాకారులు నామినేట్‌ అయ్యారు. రైనాతోపాటు  మాజీ రియల్‌ మాడ్రిడ్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు రాబర్ట్‌ కార్లోస్‌, జమైకన్‌ స్ప్రింటర్‌ అసఫా పావెల్‌, శ్రీలంక మాజీ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య, నెదర్లాండ్స్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం ఎడ్గర్‌ డేవిడ్స్‌ తదితరులు ఉన్నారు. తన క్రికెట్‌ కెరీర్‌లో అతను చేసిన సేవకు గాను ఈ అవార్డు ఇచ్చినట్లు మాల్దీవ్స్‌ ప్రభుత్వం తెలిపింది. కాగా మార్చి 17న మాల్దీవ్స్‌లోని సింథటిక్‌ రన్నింగ్‌ ట్రాక్‌ మైదానంలో ఈ అవార్డుల వేడుక జరిగింది. ఈ అవార్డును బంగ్లాదేశ్​ క్రీడామంత్రి జహీర్ హసన్​ రసెల్​.. రైనాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా, మాల్దీవుల క్రీడా మంత్రులు పాల్గొన్నారు.

ఇక రైనా టీ20ల్లో 8వేల పరుగులు సాధించిన తొలి భారతీయుడిగా.. ఐపీఎల్​లో 5వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్​లో చెన్నై జట్టు తరపున 176 మ్యాచ్​లు ఆడిన సురేశ్​ రైనా.. 32.32 సగటుతో 4687 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్​లో మొత్తం 205 మ్యాచ్​లు ఆడిన రైనా 5528 పరుగులు చేశాడు.

మరిన్ని వార్తలు