MS Dhoni: ఓటమి అనంతరం.. పాక్‌ ఆటగాళ్లతో ధోని ముచ్చట.. వీడియో వైరల్‌

25 Oct, 2021 09:48 IST|Sakshi
PC: ICC

MS Dhoni joins Pakistan players for a chat after India’s loss in Dubai: ‘‘చాలా మంది ఈ దృశ్యాలు చూడాలి. ఇండియా- పాకిస్తాన్‌ క్రికెట్‌ అసలైన స్టోరీ ఇది. మైదానం వెలుపల అంచనాలు, హైప్‌నకు ఇది అతీతం’’..  ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ షేర్‌ చేసిన వీడియోలో వినిపించిన మాటలు. నిజమే.. ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటేనే భారీ అంచనాలు. భావోద్వేగాలు. కానీ.. మైదానంలో మాత్రం అందరూ ‘ఒక్కటే’.. అంతా క్రికెటర్లే. ప్రత్యర్థి జట్టును అభినందించగల క్రీడా స్ఫూర్తి ప్రదర్శించగల గుణం ఉండాలి. టీమిండియా ఆ స్ఫూర్తిని కనబరిచింది.

టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో భాగంగా... ఆదివారం నాటి మ్యాచ్‌లో చరిత్రను తిరగరాస్తూ భారత్‌పై పాకిస్తాన్‌ 10 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో.. టీమిండియా అభిమానుల హృదయాలు బద్దలయ్యాయి. ఓటమిని జీర్ణించుకోలేకపోయారు చాలా మంది. కానీ... మ్యాచ్‌ ముగిసిన అనంతరం మైదానంలోని కొన్ని దృశ్యాలు ‘క్రీడాభిమానులను’ విపరీతంగా ఆకర్షించాయి. పాక్‌ ఆటగాళ్లు ఇమాద్‌ వసీం, షోయబ్‌ మాలిక్‌ సహా పలువురు.. టీమిండియా మెంటార్‌ ఎంఎస్‌ ధోనితో కాసేపు ముచ్చటించారు. మిస్టర్‌ కూల్‌ సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు. 

ఇక పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం వచ్చి ధోనితో కరచాలనం చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక మ్యాచ్‌ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సైతం చిరునవ్వుతో పాక్‌ ఆటగాళ్లకు విషెస్‌ చెబుతూ హుందాగా ప్రవర్తించిన తీరు పలువురిని ఆకట్టుకుంటోంది. ‘‘ఈరోజు ఆటదే అసలైన విజయం.. ఈ దృశ్యాలు ఎంత అందంగా ఉన్నాయి’’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: T20 World Cup 2021 Ind Vs Pak: ‘అసలేం చేశారయ్యా.. ఆ సెలక్షన్‌ ఏంటి?’

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు