T20 World cup 2021: రవిశాస్త్రి వ్యాఖ్యలను సమర్ధించిన పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌

10 Nov, 2021 15:29 IST|Sakshi

Babar Azam Supports Ravi Shastri Comments On Bio Bubble: టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియా ప్రస్థానం ముగిసిన అనంతరం భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ పదవికి వీడ్కోలు పలికిన రవిశాస్త్రి బయోబబుల్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత ఆరు నెలలుగా బయోబబుల్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు ఫిజికల్‌గా, మెంటల్‌గా అలసిపోయారని.. ఆటగాళ్లు కూడా మనుషులే అన్న విషయాన్ని క్రికెట్‌ బోర్డులు, అభిమానులు గుర్తించాలని.. పెట్రోల్‌ పోసి నడపడానికి టీమిండియా ఆటగాళ్లు యంత్రాలు కాదని రవిశాస్త్రి చేసిన సంచలన వ్యాఖ్యలపై పాకిస్థాన్‌ సారధి బాబర్‌ ఆజమ్‌ స్పందించాడు. 

బయోబబుల్‌లో ఆటగాళ్లు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి విషయంలో రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలను తాను సమర్ధిస్తానని అన్నాడు. ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో ఇలాంటి హెచ్చుతగ్గులు సాధారణమే అయినప్పటికీ.. ఎక్కువ కాలం బయో బుడగలో ఉండటం వల్ల  ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు అసౌకర్యానికి గురవుతారని పేర్కొన్నాడు. ఒత్తిడిని అధిగమించేందుకు ఆటగాళ్లకు తగినంత విశ్రాంతినివ్వాలని.. క్రికెట్‌ బోర్డులు ఈ విషయంలో పునరాలోచించాలని, బిజీ షెడ్యూల్‌ను ఉద్ధేశిస్తూ వ్యాఖ్యానించాడు.

క్రికెటర్లకు విశ్రాంతి తీసుకోవడం కంటే గొప్ప పని మరొకటి ఉండదని అభిప్రాయపడ్డాడు.పాక్‌ ఆటగాళ్లు సైతం గతేడాది కాలంగా నిరంతర బయో వాతావరణంలో ఉండడం వల్ల శారీరకంగా, మానసికంగా అలసిపోయారని.. అయితే తామంతా ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం ద్వారా కాస్త ఉపశమనం పొందామని తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా ఆస్ట్రేలియాతో సెమీస్‌ సమరానికి ముందు మీడియా ఏర్పాటు చేసిన వర్చువల్‌ సమావేశంలో పాక్‌ సారధి ఈ మేరకు స్పందించాడు.
చదవండి: 'సెమిఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించడం అంత సులభం కాదు'

Poll
Loading...
మరిన్ని వార్తలు