N Jagadeesan Viral Video: క్రికెటర్‌ అసభ్యకర సంజ్ఞ.. నీకసలు బుద్ధుందా? మరీ ఇంత దిగజారాలా?

24 Jun, 2022 10:38 IST|Sakshi
జగదీశన్‌ అనుచిత ప్రవర్తన(PC: TNPL)

క్రికెటర్‌ అసభ్యకర ప్రవర్తన.. మండిపడుతున్న ఫ్యాన్స్‌

నిబంధనలు తెలియవా అంటూ ఫైర్‌

Tamilnadu Premier League-2022: తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌-2022 గురువారం(జూన్‌ 23) తిరునల్వేలి వేదికగా ఆరంభమైంది. ఇందులో భాగంగా చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌, నెలాయి రాయల్‌ కింగ్స్‌ మధ్య మొదటి మ్యాచ్‌ జరిగింది. ఇండియన్‌ సిమెంట్‌ కంపెనీ గ్రౌండ్‌లో జరిగిన ఈ టీ20 మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చెపాక్‌ జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. 

తీవ్ర ఉత్కంఠ.. టై
ఈ క్రమంలో రాయల్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన చెపాక్‌ జట్టు కూడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 184 పరుగులే చేయడంతో మ్యాచ్‌ టై అయింది. దీంతో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా రాయల్‌ కింగ్స్‌ విజయం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ జట్టు బ్యాటర్‌ సంజయ్‌ యాదవ్‌ 47 బంతుల్లో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌ సందర్భంగా చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌ ఓపెనర్‌ ఎన్‌. జగదీశన్‌ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. అతడిపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. రూల్స్‌ నచ్చకపోతే క్రికెట్‌ ఆడటం మానేసెయ్‌.. అంతేగానీ మరీ ఇంత దిగజారి ప్రవర్తించకు అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

బుద్ధి ఉందా అసలు?
కాగా ప్రత్యర్థి జట్టు ఆటగాడి పట్ల ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ వ్యవహరించిన తీరే ఇందుకు కారణం. చెపాక్‌ ఇన్నింగ్స్‌ సమయంలో 3.4వ ఓవర్‌లో బాబా అపరాజిత్‌ బౌలింగ్‌కు రాగా.. కౌశిక్‌ గాంధీ క్రీజులో ఉన్నాడు. అయితే, అపరాజిత్‌ బంతి వేయకముందే నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న జగదీశన్‌ క్రీజును వీడాడు. దీంతో అపరాజిత్‌ జగదీశన్‌ మన్కడింగ్‌ చేయడంతో రనౌట్‌గా అతడు వెనుదిరిగాడు.

ఈ క్రమంలో  తీవ్ర నిరాశకు లోనైన జగదీశన్‌ అసభ్యకర సంజ్ఞ చేస్తూ మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో మొదటి మ్యాచ్‌లోనే ఇలా వివాదానికి కారణమయ్యాడని, ఆటగాళ్ల పట్ల నువ్వు ఇలాగేనా ప్రవర్తించేది.. ముందు నిబంధనలు తెలుసుకుని ఆడు అంటూ నెటిజన్లు జగదీశన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీకసలు బుద్ది ఉందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

అది రనౌటే!
క్రికెట్‌ చట్టాలు చేసే మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇది క్రికెట్‌లో రనౌట్‌! అంతేతప్ప క్రీడాస్ఫూర్తికి విరుద్ధమయ్యే మన్కడింగ్‌ కాదు. ఈ మేరకు ఎంసీసీ చేసిన పలు సవరణలను ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అమోదించింది. అయితే ఇవన్నీ ఈ ఏడాది అక్టోబర్‌ తర్వాతే అమల్లోకి రానున్నాయి.

చదవండి: Manoj Tiwari: సెంచరీ చేశా.. అయినా 14 మ్యాచ్‌లకు పక్కనపెట్టారు.. ఇప్పుడున్న మేనేజ్‌మెంట్‌ గనుక ఉండి ఉంటే!
TNPL 2022: 38 ఏళ్ల వయసులో క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న భారత ఆటగాడు..!

మరిన్ని వార్తలు