-->

ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నికి వినేశ్‌

12 Mar, 2024 01:50 IST|Sakshi

పాటియాలా: వచ్చే నెలలో కిర్గిస్తాన్‌లో జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌ ఆసియా క్వాలిఫయింగ్‌ టోర్నిలో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ బరిలోకి దిగనుంది. ఈ టోర్నిలో పాల్గొనే భారత మహిళల జట్టును ఎంపిక చేసేందుకు సోమవారం నిర్వహించిన సెలెక్షన్‌ ట్రయల్స్‌లో వినేశ్‌ 50 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. వినేశ్‌ రెగ్యులర్‌ వెయిట్‌ కేటగిరీ 53 కేజీలు కాగా... ఇప్పటికే ఈ కేటగిరీలో అంతిమ్‌ పంఘాల్‌ ఒలింపిక్‌ బెర్త్‌ దక్కించుకుంది.

దాంతో వినేశ్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌ టోర్నిలో 50 కేజీలతోపాటు 53 కేజీల విభాగంలోనూ పోటీపడింది. ఒక రెజ్లర్‌ ఒకే రోజు ఒకే వెయిట్‌ కేటగిరీలో పోటీపడాలన్న నిబంధన ఉన్నా అడ్‌హక్‌ కమిటీ వినేశ్‌ను రెండు కేటగిరీల్లో పోటీ పడేందుకు అనుమతి ఇవ్వడం వివాదాస్పదమైంది. అయితే వినేశ్‌ 53 కేజీల విభాగం సెమీఫైనల్లో ఓడిపోయింది. ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నిలో పాల్గొనే భారత జట్టులో అన్షు మలిక్‌ (57 కేజీలు), మాన్సి అహ్లావత్‌ (62 కేజీలు), నిషా దహియా (68 కేజీలు), రితిక (76 కేజీలు) కూడా ఎంపికయ్యారు.  

Election 2024

మరిన్ని వార్తలు