Sakshi News home page

All England Badminton 2024: సాత్విక్‌–చిరాగ్‌ జోడీపైనే ఆశలు!

Published Tue, Mar 12 2024 1:43 AM

All England Badminton 2024: Satwiksairaj-Chirag turn attention - Sakshi

నేటి నుంచి ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌

బర్మింహమ్‌: ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్‌కు చివరిసారి 2001లో టైటిల్‌ లభించింది. ఆనాడు పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రస్తుత టీమిండియా హెడ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ విజేతగా నిలిచాడు. ఆ తర్వాత 2015లో మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వల్‌... 2022లో పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ ఫైనల్‌ చేరి రన్నరప్‌ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు. అయితే ఈసారి పురుషుల డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టిలపై భారత బృందం భారీ ఆశలు పెట్టుకుంది.

ఈ సీజన్‌లో వీరిద్దరు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఆడిన మూడు టోరీ్నల్లోనూ (మలేసియా మాస్టర్స్, ఇండియా ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌) ఫైనల్‌ చేరారు. రెండింటిలో రన్నరప్‌గా నిలిచారు. ఆదివారం ముగిసిన ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టైటిల్‌ కూడా దక్కించుకున్నారు. అంతా సవ్యంగా సాగితే... నేడు మొదలయ్యే ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బృందం 23 ఏళ్ల టైటిల్‌ నిరీక్షణకు తెరదించే అవకాశాలున్నాయి. కానీ ఈసారి అన్ని విభాగాల్లోనూ భారత క్రీడాకారులకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది.

తొలి రౌండ్‌ దాటాక ప్రతి మ్యాచ్‌లో మేటి ప్రత్యర్థులు సిద్ధంగా ఉండనున్నారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో మాజీ చాంపియన్‌ మొహమ్మద్‌ అహ్‌సాన్‌–హెండ్రా సెతియవాన్‌ (ఇండోనేసియా)లతో సాత్విక్‌–చిరాగ్‌ తలపడతారు. సాత్విక్‌ ద్వయం ఈ అడ్డంకి దాటితే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో షోహిబుల్‌ ఫిక్రి–మౌలానా బగస్‌ (ఇండోనేసియా) జోడీ.. క్వార్టర్‌ ఫైనల్లో ఆరోన్‌ చియా–సో వుయ్‌ యిక్‌ (మలేసియా) జంట ఎదురయ్యే చాన్స్‌ ఉంది.

ఈ నేపథ్యంలో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ ప్రతి మ్యాచ్‌లో విశేషంగా రాణించాల్సి ఉంటుంది. ఇక పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో టాప్‌ సీడ్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌)తో కిడాంబి శ్రీకాంత్‌; సు లి యాంగ్‌ (చైనీస్‌ తైపీ)తో ప్రణయ్‌; ఎన్జీ జె యోంగ్‌ (మలేసియా)తో లక్ష్య సేన్‌; వర్దాయో (ఇండోనేసియా)తో ప్రియాన్షు తలపడతారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో వ్యోన్‌ లి (బెల్జియం)తో పీవీ సింధు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో సింధు గెలిస్తే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఆమె ప్రత్యరి్థగా ప్రపంచ చాంపియన్, వరల్డ్‌ నంబర్‌వన్‌ ఆన్‌ సె యంగ్‌ (దక్షిణ కొరియా)తో ఉండనుంది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ; అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీలు బరిలో ఉన్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement