Ind vs Eng: అది సరైన నిర్ణయమే.. అయినా అశ్విన్‌ను ఆడించొద్దు.. ఎందుకంటే: టీమిండియా మాజీ ఓపెనర్‌

29 Oct, 2023 11:32 IST|Sakshi
అశ్విన్‌- సిరాజ్‌

ICC WC 2023- Ind Vs Eng: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఆడించి తప్పుచేయొద్దని భారత మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. లక్నో పిచ్‌ను పొరపాటుగా అంచనా వేసి మూల్యం చెల్లించే పరిస్థితి తెచ్చుకోకూడదని విజ్జప్తి చేశాడు. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌-2023లో రోహిత్‌ సేన వరుస విజయాలు సాధిస్తున్న విషయం తెలిసిందే.

లీగ్‌ దశలో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఐదూ గెలిచి అజేయంగా నిలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో సెమీస్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన ఇంగ్లండ్‌తో ఆదివారం పోటీపడనుంది.

A post shared by Team India (@indiancricketteam)

లక్నోలోని భారత రత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఏక్నా క్రికెట్‌ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కూర్పు.. ముఖ్యంగా అదనపు స్పిన్నర్‌ను ఆడించాలా లేదా అన్న అంశంపై మాజీ బ్యాటర్‌ ఆకాశ్‌ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఆఫ్‌ స్పిన్నర్‌ను ఆడించాలన్న నిర్ణయం సరైందే.. కానీ
‘‘ఇంగ్లండ్‌ వంటి జట్టుతో ఆడుతున్నపుడు.. ఆఫ్‌ స్పిన్నర్‌ను ఆడించాలనుకోవడం సరైన నిర్ణయమే. లక్నో వంటి పెద్ద మైదానం.. కాబట్టి ఆఫ్‌ స్పిన్నర్‌ను ఆడించాలనే అభిప్రాయాలు ఉండటమూ సహజమే.

ఐపీఎల్‌లో ఇక్కడ బంతి టర్న్‌ అయింది కాబట్టి ఆఫ్‌ స్పిన్నర్‌ను ఆడిస్తే బాగుంటుందనుకోవడం మాత్రం సబబు కాదు. ఎందుకంటే ఈసారి ఐపీఎల్‌ మాదిరి వికెట్‌ ఉండబోదు. అపుడు నల్లరేగడి మట్టితో పిచ్‌ రూపొందించారు.

ఇది ఎర్రమట్టి పిచ్‌.. కాబట్టి
కానీ ఇప్పుడు ఇది ఎర్రమట్టితో చేసిన పిచ్‌. దీని మీద బంతి బౌన్స్‌ అవుతుంది. పేస్‌ రాబట్టవచ్చు. మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ పరిస్థితి మరింత మారిపోతుంది. ఒకవేళ మనం ముగ్గురు స్పిన్నర్ల సెకండ్‌ ఫీల్డింగ్‌ చేయాల్సి వస్తే.. మనకు తెలియకుండానే ప్రత్యర్థికి మంచి చేసిన వాళ్లం అవుతాం.

లేదు కచ్చితంగా ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలని భావిస్తే.. అశ్విన్‌ జట్టులోకి వస్తాడు. అలాంటపుడు పేసర్లు సిరాజ్‌.. షమీలలో ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే నా ఓటు మాత్రం షమీకే. గత మ్యాచ్‌లో సిరాజ్‌ బాగానే బౌలింగ్‌ చేశాడు.

సిరాజ్‌ వద్దు.. ఎందుకంటే
అయితే, షమీ ఐదు వికెట్ల హాల్‌తో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఫామ్‌ దృష్ట్యా సిరాజ్‌ కంటే ముందున్న షమీని తుదిజట్టులోకి తీసుకోవాలి’’ అని కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.

కాగా టీమిండియా చివరగా తలపడిన న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మహ్మద్‌ షమీ ఐదు వికెట్లు తీసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ధర్మశాలలో భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. కాగా ప్రపంచకప్‌-2023లో షమీకి ఇదే తొలి మ్యాచ్‌ కావడం విశేషం.

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌
తుది జట్ల అంచనా
టీమిండియా: రోహిత్‌ శర్మ (కెప్టెన్ ), శుబ్‌మన్‌ గిల్, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్‌ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌,  మహ్మద్‌ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌/ రవిచంద్రన్‌ అశ్విన్‌.  
ఇంగ్లండ్‌: బట్లర్‌ (కెప్టెన్ ), బెయిర్‌స్టో, మలాన్, రూట్, స్టోక్స్, బ్రూక్, లివింగ్‌స్టోన్, వోక్స్, విల్లీ, అట్కిన్సన్, రషీద్‌.  

చదవండి: హార్దిక్‌ వచ్చేంత వరకు అతడే.. ఇంగ్లండ్‌ డేంజరస్‌ టీమ్‌! కాబట్టి మేము.. 
WC 2023: దెబ్బ మీద దెబ్బ.. పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ

A post shared by Team India (@indiancricketteam)

మరిన్ని వార్తలు