WC 2023: పాకిస్తాన్‌ బౌలింగ్‌ను చిత్తు చేసి.. భారీ స్కోరుతో రికార్డులు సృష్టించిన న్యూజిలాండ్‌

4 Nov, 2023 15:03 IST|Sakshi
రచిన్‌ రవీంద్ర, కేన్‌ విలియమ్సన్‌

వన్డే వరల్డ్‌కప్‌-2023లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ భారీ స్కోరు సాధించింది. పాక్‌ పేసర్ల బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్న కివీస్‌ బ్యాటర్లు జట్టుకు రికార్డు స్థాయి స్కోరు అందించారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శనివారం టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఈ క్రమంలో హసన్‌ అలీ కివీస్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వేను 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత మళ్లీ వికెట్ల కోసం ప్రయత్నించిన పాక్‌ బౌలింగ్‌ విభాగానికి.. మరో ఓపెనర్‌ రచిన్‌ రవీంద్ర, కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కొరకరాని కొయ్యలా తయారయ్యారు.

A post shared by ICC (@icc)

రచిన్‌ 108, కేన్‌ విలియమ్సన్‌ 95 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ జోడీని ఇఫ్తికార్‌ అహ్మద్‌ విడదీసినా అప్పటికే భారీ స్కోరుకు బలమైన పునాది పడింది. ఇక మిగిలిన వాళ్లలో డారిల్‌ మిచెల్‌ 29, మార్క్‌ చాప్‌మన్‌ 39, గ్లెన్‌ ఫిలిప్స్‌ 41, మిచెల్‌ శాంట్నర్‌ 26 పరుగులు(నాటౌట్‌) సాధించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి న్యూజిలాండ్‌ 401 పరుగులు స్కోరు చేసింది. 

A post shared by ICC (@icc)

తద్వారా చిన్నస్వామి స్టేడియంలో అత్యధిక స్కోరు నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచింది. అదే విధంగా.. వరల్డ్‌కప్‌ ఈవెంట్లో సౌతాఫ్రికా(3 సార్లు) తర్వాత టీమిండియా, ఆస్ట్రేలియాతో కలిసి 400+ స్కోరు నమోదు చేసిన నాలుగో జట్టుగా అవతరించింది.

అంతేకాదు.. వన్డేల్లో పాకిస్తాన్‌పై అత్యధిక స్కోరు సాధించిన రెండో జట్టుగా కివీస్‌ చరిత్ర సృష్టించింది. గతంలో ఇంగ్లండ్‌ పాక్‌తో 2016 నాటి మ్యాచ్‌లో 444/3 స్కోరు నమోదు చేసింది. 

వీటితో పాటు మరో అరుదైన ఘనతను కూడా న్యూజిలాండ్‌ జట్టు తమ ఖాతాలో వేసుకుంది. వరల్డ్‌కప్‌ చరిత్రలో పాకిస్తాన్‌ మీద అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు సాధించింది.

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు