మాకు భయం లేదు.. నమ్మకం ఉంది: అయ్యర్‌

3 Nov, 2020 20:28 IST|Sakshi

దుబాయ్‌:  ముంబై ఇండియన్స్‌తో జరగబోయే తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ స్పష్టం చేశాడు. ముంబైతో మ్యాచ్‌లో తాము సహజ సిద్ధమైన ఆటను ఆడతామనే ధీమా వ్యక్తం చేశాడు. ముంబై ఇండియన్స్‌ అంటే తమకు భయం లేదని, ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. సోమవారం ఆర్సీబీతో మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత అయ్యర్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ‘ ముంబై అంటే మాకు భయం లేదు. ముంబై ఇండియన్స్‌ అత్యుత్తమ జట్లలో ఒకటి. అయినా మాలో ఆత్మవిశ్వాసం ఉంది.

అదే సమయంలో మా జట్టు కూడా బలంగానే ఉంది. క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ముంబైపై విజయం సాధిస్తామా.. లేదా అనేది ఆరోజు పరిస్థితిని బట్టి ఉంటుంది. ముంబైకు ఫైనల్స్‌ ఆడిన అనుభవం చాలా ఎక్కువ. ముంబై పటిష్టంగా ఉందనే విషయం ఒప్పుకోవాలి. అప‍్పటి పరిస్థితిని బట్టే విజయం అనేది ఆధారపడి ఉంటుంది. ఏ విషయాన్నైనా ఎక్కువగా తీసుకుంటే ఒత్తిడిలో పడతాం. అది పెద్ద సమస్యగా మారిపోతుంది’ అని అయ్యర్‌ తెలిపాడు. ఇక ఆర్సీబీపై విజయం తమలో ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చిందన్నాడు. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత ఈ విజయం  తమకు చాలా అవసరమే కాకుండా ఆటగాళ్ల ముఖాల్లో నవ్వులు పూసాయన్నాడు. అనేక ఎత్తు పల్లాల తర్వాత రెండో స్థానానికి చేరడం ఆనందాన్ని తీసుకొచ్చిందన్నాడు. గురువారం దుబాయ్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య క్వాలిఫయర్‌-1 జరుగుతుంది. ఇక్కడ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌ చేరుతుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో తలపడుతుంది. 
 

>
మరిన్ని వార్తలు