Vizianagaram: రైలు ప్రమాదంలో లోకో పైలెట్‌ మృతి

31 Oct, 2023 09:19 IST|Sakshi

విజయనగరం: కంటకాపల్లి రైలు ప్రమాదంలో ఎచ్చెర్ల మండలం కుశాలపురం గ్రామానికి చెందిన సువ్వారి చిరంజీవి (36) మృతి చెందారు. ప్రమాదానికి గురైన రైలుకు ఆయన అసిస్టెంట్‌ లోకో పైలెట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రమాద సంఘటన మీడియా ద్వారా తెలుసుకున్న తండ్రి సన్యాసిరావు, తల్లి అమ్మాజీ, గ్రామ పెద్దలు, బంధువులు హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. చిరంజీవికి మూడేళ్ల కిందట పెళ్లయ్యింది. భార్య జ్యోత్స్న, రెండేళ్ల కుమారుడు నవదీప్‌తో కలిసి విశాఖలో నివాసం ఉంటూ అక్కడే విధులు నిర్వహిస్తున్నాడు.

తల్లిదండ్రులు కుశాలపురంలో నివాసముంటున్నారు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలో ట్రిపుల్‌ ఈలో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన చిరంజీవి 2013లో అసిస్టెంట్‌ లోక్‌ పైలెట్‌గా ఎంపికయ్యాడు. జీవితంలో స్థిరపడి ఉద్యోగం చేస్తున్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు ఎంతో ఆనందించేవా రు. ఇప్పుడు అకస్మాత్తుగా బిడ్డ మరణ వార్త వినాల్సి రావడంతో వారు తల్లడిల్లిపోయారు. మృతదేహానికి విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కుశాలపురంలో సోమవారం అంత్యక్రియలు చేశారు.  

మరిన్ని వార్తలు