కాశీబుగ్గ: విజయనగరంలో జరిగిన రైలు ప్రమాదంలో పలాస మండలం మరదరాజపురం గ్రామానికి చెందిన నిరాకర మిశ్రో గాయపడ్డారు. కనురెప్పపాటులో జరిగిన సంఘటనలో ఒక్కసారిగా ఉన్నట్టుండి బోగి పైకిలేచి పడిపోవడంతో కుడిచెయ్యి ఎముక, జబ్బ పూర్తిగా దెబ్బతిన్నాయి. విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్నారు. మిత్రుల సాయం చేయడంతో బయటపడ్డానని లేకుంటే ప్రాణాలు పోయేవని మిశ్రో తెలిపారు.
బొడ్డేపల్లి వాసికి..
పొందూరు: విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో పొందూరు మండలంలోని బొడ్డేపల్లి గ్రామానికి చెందిన బొడ్డేపల్లి తేజేశ్వరరావుకు తీవ్రగాయాలయ్యాయి. పనిమీద విశాఖపట్నంకు వెళ్లి డీఎంయూలో తిరిగి వస్తుండగా రైలు ప్రమాదానికి గురవ్వడంతో గాయాలపాలయ్యారు. తేజేశ్వరరావును విశాఖపట్టణంలోని రైల్వే ఆస్పత్రిలో చేర్చారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పారు.