వేలూరు: డీఎంకే ప్రభుత్వంలోనే గ్రామీణ ప్రాంతాలతో పాటు అనకట్టు నియోజకవర్గంలోని అటవీ గ్రామాలకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే నందకుమార్ అన్నారు. వేలూరు జిల్లా అనకట్టు నియోజకవర్గం కన్నియంబాడి యూనియన్ పరిధిలోని నాగనది నుంచి తైన్నె గ్రామం వరకు రూ.11.50 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులను కలెక్టర్ కుమరవేల్ పాండియన్ బుధవారం ఉదయం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనకట్టు నియోజకవర్గంలో అధికంగా అటవీ గ్రామాలు ఉండడంతో కాలి నడకన కూడా నడిచి వేళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే వారని తెలిపారు. అయితే తమ ప్రభుత్వం వచ్చిన అనంతరం రోడ్డుతో పాటు బస్సు సౌకర్యం, రేషన్ దుకాణం, పాఠశాలలు వంటి వసతులను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలు అడిగిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బాబు, జిల్లా ఫారెస్ట్ అధికారి కళానిధి, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు అధికారి ఆర్తీ, సర్పంచ్ దివ్య పాల్గొన్నారు.