కనులపండువగా
స్కంధషష్టి ఉత్సవాలు
తిరుత్తణి: స్కంధషష్టి రెండవరోజు ఉత్సవాల్లో బుధవారం షణ్ముఖర్కు బిల్వార్చన పూజలు నిర్వహించారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం స్కంధషష్టి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రెండవ రోజు బుధవారం వేకువజామున మూలవర్లకు ప్రత్యేక అభిషేక ఆరాధ పూజలు చేసి బంగారం, వజ్రాభరణాలతో చందనం అలంకరణలో కనువిందు చేశారు. స్కంధషష్టి సందర్భంగా భక్తులు మురుగన్ మాలధారణతో కొండ ఆలయం చేరుకుని క్యూలో వేచివుండి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కావడి మండపంలో పు ష్పాలంకరణలో షణ్ముఖర్ బిల్వార్చన పూజల్లో పాల్గొని హరోహర నామస్మరణతో దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు షణ్ముఖర్కు బిల్వార్చన పూజలు నిర్వహించారు. రెండవ రోజు పూజల్లో డీఎంకే మాజీ జిల్లా కార్యదర్శి భూపతి, ఆలయ ధర్మపాలక మండలి సభ్యుడు సురేష్బాబు పాల్గొన్నారు.
పశువైద్యశిబిరానికి విశేష స్పందన
పళ్లిపట్టు: కొత్తకుప్పంలో నిర్వహించిన పశువైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పళ్లిపట్టు యూనియన్ అత్తిమాంజేరిపేట పశువైద్య కేంద్రం పరిధిలోని కొత్తకుప్పంలో పశుసంవర్థక శాఖ ద్వారా ప్రత్యేక మూగజీవాలకు ఆరోగ్య వైద్యశిబిరాన్ని తిరుత్తణి డివిజన్ సహాయ డైరెక్టర్ దామోదరన్ ప్రారంభించారు. పశు వైద్యులు సెంథిల్కుమార్, గీత, వెటర్నరీ సీఐ శరవణన్, స్టాలిన్, జంతు సంరక్షణ సహాయకులు అయప్పన్, అముద, కృత్రిమ గర్భధారణ అధికారి కుమరేశన్ ఆధ్వర్యంలోని పశువైద్యుల బృందం మూగజీవాలకు టీకాలు వేసి నులిపురుగుల పరీక్షలు చేశారు. శిబిరంలో 1,390 మూగజీవాలకు వైద్యపరీక్షలు చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించి ఉత్తమ దూడ లకు తొలి మూడు బహుమతులతో పాటు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. శిబిరంలో 166 మంది రైతులు, గ్రామీణులు పాల్గొన్నారు. శిబిరంలో 1390 పశువులకు వైద్య పరీక్షలు చికిత్స చేసినట్లు సహాయ డైరెక్టర్ దామోదరన్ తెలిపారు.