ఎస్‌జే.సూర్య నేటి నడిగవేల్‌

16 Nov, 2023 01:38 IST|Sakshi
జిగర్తండా డబుల్‌ ఎక్స్‌ చిత్ర యూనిట్‌తో రజనీకాంత్‌

తమిళసినిమా: కార్తీక్‌సుబ్బరాజ్‌ దర్శకత్వంలో నటుడు రాఘవ లారెన్స్‌, ఎస్‌జే.సూర్య ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం జిగర్తండా డబుల్‌ ఎక్స్‌. దీపావళికి విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన మధ్య మంచి వసూళ్లను సాధిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని నటుడు రజనీకాంత్‌ తన ఇంట్లోని హోమ్‌ థియేటర్‌లో చూసి యూనిట్‌ వర్గాలను ప్రశంసించారు. ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో జిగర్తండా డబుల్‌ ఎక్స్‌ చిత్రం ఒక కురింజి మలర్‌ (12 ఏళ్లకు ఒకసారి పూసే అరుదైన పువ్వు) అని పేర్కొన్నారు. దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్‌ అద్భుత దర్శకత్వ ప్రతిభ, విభిన్నమైన కథ సినిమా ప్రేక్షకులు ఇప్పటి వరకూ చూడనటువంటి సన్నివేశాలు, రాఘవ లారెన్స్‌ ఇలా కూడా నటించగలరా అనే ఆశ్చర్యం కలగజేసిందన్నారు. ఇక ఎస్‌జే.సూర్య నేటి నడిగవేల్‌ అని పేర్కొన్నారు. విలనిజం, కామెడీ, గుణ చిత్ర నటన కలిసి ఆశ్చర్య పరిచిందన్నారు. ఇక ఛాయాగ్రాహకుడు తిరు తన పనితనంతో ఆడుకున్నారని, కళా దర్శకుడి శ్రమ అభినందనీయం అని అన్నారు. దిలీప్‌ సుబ్బరాయన్‌ కంపోజ్‌ చేసిన పోరాట దృశ్యాలు అబ్బురపరిచాయన్నారు. సంతోష్‌నారాయణన్‌ వైవిధ్యభరిత కథా చిత్రాలకు విభిన్న సంగీతాన్ని అందించడంలో కింగ్‌ అని ప్రశంసించారు.ఈయన సంగీతం ఈ చిత్రానికి ప్రాణం అని పేర్కొన్నారు. ఉత్తమ సంగీత దర్శకుడు అని ఈ చిత్రం ద్వారా ఆయన నిరూపించుకున్నారన్నారు. బ్రహ్మాండంగా నిర్మించిన ఈ చిత్ర నిర్మాతకు తన అభినందనలు అని రజనీకాంత్‌ పేర్కొన్నారు. బుధవారం రజనీకాంత్‌ ముంబయికి చేరుకున్నారు. అయితే ఆయన చిత్ర షూటింగ్‌కు కాదు. ఇండియా, న్యూజిలాండ్‌ల మధ్య జరిగే సెమీస్‌ క్రికెట్‌ను తిలకించడానికి అనేది విశేషం.

మరిన్ని వార్తలు