రూ.161 కోట్లతో మర్రి జనార్దన్రెడ్డి టాప్
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదికలో వెల్లడి
కేటీఆర్ ఆస్తులు రూ.41 కోట్లు, అప్పులు రూ.27 కోట్లు
కేసీఆర్ ఆస్తులు రూ.23 కోట్లు, అప్పులు రూ.8 కోట్లు
ఈటల రాజేందర్ ఆస్తులు రూ.56 కోట్లు, అప్పులు రూ.8 కోట్లు
మొత్తంగా 72 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని ఎమ్మెల్యేల్లో 90శాతం అంటే 106 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. అధికార బీఆర్ఎస్కు చెందిన 101 మంది ఎమ్మెల్యేలలో 93 మంది (92%), ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలలో ఐదుగురు (71%), ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో నలుగురు (67%), బీజేపీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు (100%), ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల ఆస్తులు రూ.కోటి కంటే ఎక్కువేనని తెలిపింది.
మొత్తంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.13.57 కోట్లు అని వెల్లడించింది. పార్టీల వారీగా చూస్తే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.14.11 కోట్లు, ఎంఐఎం ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.10.84 కోట్లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.4.22 కోట్లు, బీజేపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.32.61 కోట్లు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.4.66 కోట్లుగా తేల్చింది.
రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ ఖాళీగా ఉంది. ఈ క్రమంలో మిగతా 118 నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తులు, నేర చరిత్ర తదితర అంశాలపై 2018 ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ సంస్థ శనివారం తమ నివేదికను విడుదల చేసింది. బహిష్కరణకు గురైన, పార్టీని వీడి ఇతర పార్టీలో చేరిక ఖరారుకాని ఇద్దరు ఎమ్మెల్యేలను స్వతంత్రులుగా చూపింది.
పార్టీలు మారినవారు 16 మంది
ఏడీఆర్ నివేదిక ప్రకారం.. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. అందులో 12 మంది కాంగ్రెస్ నుంచి గెలిచినవారుకాగా, ఇద్దరు టీడీపీ నుంచి, ఒకరు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచారు. వీరంతా బీఆర్ఎస్లో చేరారు. ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గ్రాడ్యుయేట్లు 58 శాతమే..
రూ.161 కోట్లతో మర్రి జనార్దన్రెడ్డి టాప్
సగానికిపైగా ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
రాష్ట్రంలో అన్నిపార్టీలు కలిపి ప్రస్తుతమున్న 118 మంది ఎమ్మెల్యేలకుగాను.. 72 మంది (61%)పై క్రిమినల్ కేసులు ఉన్నాయని.. ఇందులో బీఆర్ఎస్ వారే 59 మంది అని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. బీఆర్ఎస్కు ఉన్న 101 మంది ఎమ్మెల్యేల్లో ఇది 58శాతమని తెలిపింది. ఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఆరుగురిపై (86%), ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో నలుగురిపై (67%), బీజేపీకి చెందిన ఇద్దరు (100%) ఎమ్మెల్యేలపై, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ఒకరిపై (50%) క్రిమినల్ కేసులు ఉన్నట్టు వారు గత ఎన్నికల అఫిడవిట్లలో తెలిపారని వివరించింది.
మొత్తంగా 46 మంది (39%) సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొంది. అందులో బీఆర్ఎస్ వారు 38 మంది అని తెలిపింది. ఏడుగురు ఎమ్మెల్యేలపై హత్యాయత్నం, నలుగురిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని.. ఒక ఎమ్మెల్యేపై అత్యాచారానికి సంబంధించిన కేసు ఉందని వివరించింది.