పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 72.5% సీట్లు భర్తీ

8 Aug, 2022 01:34 IST|Sakshi

కౌన్సెలింగ్‌లో 28,562 సీట్లకుగాను నిండిన 20,709 సీట్లు

21 ప్రభుత్వ, 3 ప్రైవేటు కాలేజీల్లో 100% అడ్మిషన్లు

ఎల్లుండిలోగా చేరకుంటే సీట్లు రద్దవుతాయని కన్వీనర్‌ స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: టెన్త్‌ తర్వాత డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన పాలిసెట్‌–2022 కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 118 పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని దాదాపు 25 బ్రాంచీల్లో 28,562 సీట్ల భర్తీకి చేపట్టిన కౌన్సెలింగ్‌లో 20,709 సీట్లు (72.51%) నిండాయని సెట్‌ కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. 21 ప్రభుత్వ కాలేజీలు, 3 ప్రైవేటు కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు.

సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 10 నాటికి లాగిన్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసి సీటును నిర్ధారించుకొని కాలేజీలో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకుంటే సీటు రద్దవుతుందన్నారు. పాలిటెక్నిక్‌ కాలేజీల్లో సోమవారం నుంచి అకడమిక్‌ సెషన్‌ ప్రారంభం కానుండగా 16వ తేదీ వరకు ఓరియంటేషన్, ఈ నెల 17 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

8 బ్రాంచీల్లో సీట్లన్నీ ఫుల్‌...
పాలిటెక్నిక్‌ కోర్సుల్లో 8 బ్రాంచీల్లో 100% సీట్లు భర్తీ అయ్యాయి. ఆర్కిటెక్చరల్‌ అసిస్టెంట్‌షిప్, ఆర్టిఫిషి యల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్, బయో మెడికల్‌ ఇంజనీరింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అండ్‌ బిగ్‌ డేటా, కెమికల్, సైబర్‌ ఫిజికల్‌ సిస్టమ్స్‌ అండ్‌ సెక్యూరిటీ, కంప్యూటర్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ వీడియో ఇంజనీరింగ్‌ బ్రాంచీల్లో సీట్లన్నీ నిండాయి. టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, లెదర్‌ గూడ్స్‌ అండ్‌ ఫుట్‌వేర్‌ టెక్నాలజీ, మెటర్లాజికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో అతితక్కువగా సీట్లు భర్తీ అయ్యాయి.  

మరిన్ని వార్తలు